షాద్నగర్టౌన్, జనవరి 28 : గతంలో ప్రధాన దారుల్లో సరైన విద్యుత్ దీపాలు లేక వాహనదారులు అనేక ఇబ్బందులుపడ్డారు. చిమ్మచీకటిలో ముందు వెళ్తున్న వాహనాలు కనబడక ఎన్నో ప్రమాదాలు కూడా జరిగాయి. పాదచారులు రాత్రి వేళల్లో రోడ్డు దాటాలంటే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడే పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ పట్టణాల సుందరీకరణకు శ్రీకారం చుట్టింది. పట్టణాల ప్రధాన దారుల్లో ఎల్ఈడీ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంది. దీంతో పట్టణం ప్రధాన దారుల్లో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ విద్యుత్ దీపాల వెలుగుల్లో వాహనదారులు తమ ప్రయాణాన్ని సాఫీగా సాగిస్తున్నారు. ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ చొరవతో షాద్నగర్ పట్టణంలోని పరిగి రోడ్డు డివైడర్ మధ్యలో నూతనంగా బటర్ఫ్లై లైట్ల ఏర్పాటు సరికొత్త శోభను సంతరించుకుంది. రాత్రి వేళలా వెన్నెలలా వెలుగునిస్తున్న ఎల్ఈడీ దీపాలను ఏర్పాటు చేయడంపై వాహనదారులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రూ.50 లక్షలతో ఎల్ఈడీ విద్యుత్ దీపాల ఏర్పాటు
పరిగి రోడ్డు డివైడర్ మధ్య డీఎంఎఫ్ నిధులు రూ.50లక్షలతో ఏర్పాటు చేసిన బటర్ైప్లె లైట్లను ఇటీవలే ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రారంభించారు. గతంలోనే పట్టణంలోని రైల్వే స్టేషన్ నుంచి పట్టణ ముఖ్య కూడలి వరకు ఎల్ఈడీ విద్యుత్ దీపాలతో పాటు ముఖ్య కూడలిలో హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేశారు.
సాఫీగా ప్రయాణం..
గతంలో పరిగి రోడ్డులో ప్రయాణించాలంటే భయంగా ఉండేది. నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల వెలుగుల్లో సాఫీగా ప్రయాణం సాగిస్తున్నా.
– హరిబాబు, వాహనదారుడు షాద్నగర్
చాలా సంతోషంగా ఉంది..
పరిగి రోడ్డులో బటర్ఫ్లై లైట్లను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. గతంలో రాత్రి వేళ వాహనాలు కనబడక తరచూ ప్రమాదాలు జరిగేవి. బటర్ఫ్లై లైట్ల ఏర్పాటుతో ఎంతో సౌకర్యంగా ఉంది.
– భానుప్రకాశ్, వాహనదారుడు, షాద్నగర్