ఆమనగల్లు, మార్చి 27 : బీఆర్ఎస్తోనే బహుజనులకు న్యాయం జరుగుతుందని నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బుధవారం హైదరాబాద్లోని ఆర్ఎస్పీ నివాసంలో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన బీఎస్పీ అసెంబ్లీ అధ్యక్షుడు బండగల్ల చందు ఆధ్వర్యంలో బీఎస్పీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరగా, ఆర్ఎస్పీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమన్నారు.
బహుజనవాదం తెలంగాణవాదం ఒకటే అని అన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగానే మారుస్తుందని అరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ సోషల్ మీడియా నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నదని, ఇలాంటి చర్యలకు పాల్పడడం అటు మోదీ ప్రభుత్వానికి ఇటు తెలంగాణ ప్రభుత్వానికి మంచిది కాదని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం వారి మాటలు వినని నాయకులపై ఈడీ , సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను అడ్డంపెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదన్నారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో అసెంబ్లీ అడ్వైజర్ కొమ్ముకిరణ్, వెల్డండ, మాడ్గుల మండలాల ఇన్చార్జీలు దొబ్బల భాస్కర్, బద్దీ రాజు, ఆమనగల్లు మండల అధ్యక్షుడు కొప్పు మహేష్, తలకొండపల్లి మండల ఉపాధ్యక్షుడు మహేష్, సీనియర్ నాయకులు బాలరాజుతో పాటు పెద్ద ఎత్తున గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.