రంగారెడ్డి, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : చేవెళ్ల లోక్సభ స్థానం గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెట్టింది. ఇతర పార్టీలతో పోలిస్తే సన్నాహక సమావేశాలతో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. ఈ స్థానాన్ని గతంలో రెండు పర్యాయాలు గెలుచుకున్న బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నది. ఎప్పటికప్పుడు నేతలతో భేటీ కావడంతోపాటు సమావేశాలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ క్యాడర్ను సమాయత్తపరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 13న చేవెళ్లలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. కేసీఆర్ పాల్గొనే ఈ సభ ద్వారా ప్రత్యర్థి పార్టీలకు బీఆర్ఎస్ గెలుపు సంకేతాన్ని ఇవ్వాలని పార్టీ శ్రేణులు సంకల్పిస్తున్నాయి.
కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలే అస్త్రంగా..
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీ పథకాలను అమలు చేయడంలో చతికిల పడింది. ఆరు గ్యారెంటీలలో రెండింటిని పూర్తిగా వదిలేసింది. రెండు లక్షల రుణ మాఫీ, ధాన్యానికి రూ.500 బోనస్ అంశాలను ప్రభుత్వం విస్మరించింది. రైతు భరోసా కింద అందించిన సాయం సైతం అరకొరగానే ఉన్నది. గ్యారెంటీల్లోని కొన్ని అసంపూర్ణంగా ఉండిపోగా మరికొన్ని పూర్తిగా అమలుకు నోచుకోకుండా మిగిలిపోయాయి. అబద్దపు ప్రచారంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను ఎండగడుతూ వస్తున్న బీఆర్ఎస్కు ఎన్నికల వేళ అస్త్రం దొరికింది. లోక్ సభ ఎన్నికల్లో దీన్నే విస్తృతంగా ప్రచారం చేసి కాంగ్రెస్ను ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతున్నది. తాజాగా నెలకొన్న కరువు పరిస్థితులపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు క్షేత్రస్థాయిలో ఎండగడుతున్నారు. ఓ వైపు రైతులకు బాసటగా నిలుస్తూనే.. రైతులు కష్టాలపాలు కావడానికి కాంగ్రెస్సే కారణమంటూ.. ప్రజానీకానికి వివరిస్తున్నారు. మత రాజకీయాలు చేస్తున్న బీజేపీ తీరును ప్రజలకు వివరిస్తున్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంలో బీజేపీ విఫలం కావడం.. ఈడీ వంటి సంస్థలతో దాడులు చేయిస్తున్న అంశాలను అనుకూలంగా మలుచుకుని బీఆర్ఎస్ ముందుకు సాగుతున్నది.
బీసీ నినాదంతో ప్రజల్లోకి..
కేసీఆర్ వ్యూహాత్మకంగా చేవెళ్ల జనరల్ స్థానంలో బీసీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారు. బీసీ సామాజిక వర్గం మద్దతును కూడగట్టుకునేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలపై ప్రచారం చేయడంతోపాటు బీసీ వర్గాలకు బీఆర్ఎస్ వెన్నుదన్నుగా ఉన్న అంశాలను ఎన్నికల ప్రచారంలో ప్రజలకు వివరించి వారి మద్దతు కూడగట్టుకునేలా ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న రంజిత్రెడ్డి, బీజేపీ నుంచి పోటీ చేస్తున్న విశ్వేశ్వర్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఇతర పార్టీల్లోకి జంప్ కావడంతో స్థానికంగా వారిద్దరిపై తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఇది బీఆర్ఎస్కు అనుకూలించే అంశంగా పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికే నేతలతో భేటీలు, సమావేశాలు నిర్వహించి గెలుపు వ్యూహాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 13న చేవెళ్లలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నది. కేసీఆర్ పాల్గొనే ఈ సభ ద్వారా ప్రతిపక్ష పార్టీల్లో దడ పుట్టించాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. సభ తర్వాత కొత్త ఉత్తేజంతో బీఆర్ఎస్ క్యాడర్ మరింత దూకుడుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నది.