వికారాబాద్, ఏప్రిల్ 10 : అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి వ్యతిరేకతను మూటగట్టుకున్నదని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, పార్లమెంట్ ఎన్నికల వికారాబాద్ కో-ఆర్డినేటర్ పి.కార్తీక్రెడ్డి ఆరోపించారు. బుధవారం వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. పాత ప్రభుత్వమే బాగుండేదని జనం ఆలోచనలో పడ్డారన్నారు. అవకాశం, స్వార్థం కోసం రంజిత్రెడ్డి పార్టీ మారారని, ప్రజలే ఈ ఎన్నికల్లో గట్టిగ బుద్ధి చెబుతారన్నారు.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13న చేవెళ్ల సమీపంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉన్నట్లు తెలిపారు. ఈ సభకు లక్షలాదిగా జనం తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని పూర్తి చేయలేదని, రూ.500 గ్యాస్, ఉచిత కరెంట్ పూర్తిస్థాయిలో అమలుకాలేదన్నారు.
ఇప్పటి వరకు ఎంతమందికి రైతుబంధు ఇచ్చారో చెప్పాలన్నారు. నేడు ప్రజలంతా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. సీఎం రేవంత్రెడ్డి కొడంగల్లో చేసిన వ్యాఖ్యలతోనే తాను బలహీనంగా ఉన్నాడని చెప్పకనే చెబుతున్నట్లుగా ఉన్నదన్నారు. సీఎం హయాంలో ఒక నాయకుడు పార్టీలో చేరితే ఆ పార్టీ నాయకులే చెల్లదంటూ చెబుతుండడం చూస్తే కాంగ్రెస్లో అంతర్గతంగా కుమ్ములాటలు ఎలా ఉన్నాయో అర్థమవుతుందన్నారు.
కొండా విశ్వేశ్వర్రెడ్డి, రంజిత్రెడ్డిలు రాజకీయంగా ఎవరికి తెలియదని, కేసీఆర్ బొమ్మ మీదనే గెలిచారని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. బీసీ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, ఆయా మండలాల అధ్యక్షులు శ్రీకాంత్రెడ్డి, అనిల్, శ్రీకాంత్రెడ్డి, సీనియర్ నాయకులు సత్యనారాయణరెడ్డి, కౌన్సిలర్లు గోపాల్, అనంత్రెడ్డి, నాయకులు మేక చంద్రశేఖర్రెడ్డి, వేణుగోపాల్రెడ్డి, గిరీశ్కొఠారీ పాల్గొన్నారు.