ఎన్నికల రణరంగంలో గులాబీ దళం దూసుకెళ్తున్నది. సోమవారం రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచార జోరును పెంచారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్మాస్పల్లిలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసి ప్రచారాన్ని షురూ చేశారు. జమ్మలబాయి తండా, పూల్లేరుబోడు తండా, పోచమ్మగడ్డ తండా, గానుగుమర్ల తండా, కానుగుబాయి తండాల్లో విస్తృతంగా పర్యటించారు. షాద్నగర్ నియోజకవర్గంలోని కేశంపేట మండలం భైర్ఖాన్పల్లి గ్రామంలో ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పలు గ్రామాల్లో మహిళలు బోనాలతో స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టగా, డప్పు కళాకారుల ప్రదర్శనలు.. ర్యాలీలతో ప్రచారం హోరెత్తింది. గడపగడపకూ వెళ్లి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు కొత్త మ్యానిఫెస్టో అమలుతో కలిగే ప్రయోజనాలను తెలుపుతున్నారు. మళ్లీ ఆశీర్వదిస్తే అండగా ఉంటామని భరోసానిస్తున్నారు. బీఆర్ఎస్కు హ్యాట్రిక్ విజయాన్ని కట్టబెట్టాలని ఓటర్లను అభ్యర్థించారు. ఓ వైపు పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలు.. మరోవైపు విస్తృతస్థాయి సమావేశాలతో అభ్యర్థులు రోజంతా బిజీబిజీగా గడిపారు. కాలనీల అసోసియేషన్లు, కుల సంఘాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుండగా.. బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతున్నది. మీర్పేట కార్పొరేషన్ పరిధిలో మంత్రి సబితారెడ్డి, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్రెడ్డి, శంకర్పల్లి మండలం బుల్కాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే కాలె యాదయ్యల సమక్షంలో వివిధ పార్టీలవారు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఏ ఊరికెళ్లినా బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపైనే జనం చర్చించుకుంటూ జేజేలు పలుకుతుండడం గమనార్హం.
రంగారెడ్డి, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : గులాబీ పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. ఓ వైపు పార్టీ కార్యాలయాల ప్రా రంభోత్సవాలు, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తూనే మరోవైపు గ్రామాల్లో ముమ్మరంగా పర్యటిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప దేండ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడపగడపకూ వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నా రు. కాంగ్రెస్, బీజేపీలను నమ్మి మోసపోవద్దని.. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలకు వివరిస్తున్నా రు. మళ్లీ ఆశీర్వదిస్తే అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. డప్పు కళాకారుల ప్రదర్శనలు..ర్యాలీలతో ప్రచారం హోరెత్తుతున్నది. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై వాడవాడలా విస్తృతస్థాయిలో చర్చ జరుగుతున్నది. అన్నివర్గాల వారిని సంతృప్తి పరిచేలా ఉందని ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నది. కుల సంఘాలు, కాలనీల అసోసియేషన్ల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుండగా బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం సైతం మరింత ఊపందుకున్నది.
బైక్ ర్యాలీలు..
సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీ ఫామ్లు అందుకున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో మరింత జోరు పెంచారు. బైక్ ర్యాలీలు, డప్పు కళాకారుల ప్రదర్శనలతో ప్రచారం హోరెత్తుతున్నది. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సోమవారం అన్మాస్పల్లిలో వేంకటేశ్వరస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. జమ్మలబాయితండా, పూల్లేరుబోడు తండా, పోచమ్మగడ్డ తండా, గానుగుమర్ల తండా, కానుగుబాయితండాల్లో విస్తృతంగా పర్యటించి కడ్తాల్లో నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను సబ్బండ వర్ణాల కు వివరించారు. కేశంపేట మండలంలో ప్రచారం చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే అంజయ్యయాదవ్కు అపూర్వ స్వాగతం లభించింది. బైర్ఖాన్పల్లిలో డప్పు కళాకారుల నృత్య ప్రదర్శన మధ్య ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం నిర్వహించారు. యాచారంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్ ప్రారంభించారు. అనంతరం యాచారంలో నిర్వహించిన బూత్ కమిటీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మె ల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పాల్గొని బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు కుల సంఘాలు, కాలనీల అసోసియేషన్ల మద్దతు వెల్లువెత్తుతున్నది. మీర్పేట కార్పొరేషన్ పరిధిలోని 51 కాలనీల అసోసియేషన్ల సభ్యులు మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మద్దతు పలుకుతూ మంత్రికి లేఖను అందజేశారు. సోమవారం తుక్కుగూడ మున్సిపాలిటీలోని రావిర్యాలలో 30 మంది బీజేపీ ముఖ్యకార్యకర్తలు, మంఖాల్ గ్రామంలో బీజేపీకి చెందిన మాజీ వార్డు సభ్యులు, టీడీపీ గ్రామశాఖ అధ్యక్షులు వారి వారి అనుచరులతో మంత్రి సబితాఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 12వ వార్డు పరిధిలోని ఇంద్రానగర్కాలనీకి చెందిన 100 మంది బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. శంకర్పల్లి మండలంలోని బుల్కాపూర్ గ్రామానికి చెందిన 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే కాలె యాదయ్య సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
సీఎం ప్రకటించిన మ్యానిఫెస్టోపై వాడవాడలా చర్చ జరుగుతున్నది. ఇప్పటివరకు చేపట్టిన సంక్షేమానికి కొనసాగింపుగా మరికొన్ని కొత్త సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ అధినేత మ్యానిఫెస్టోలో చేయడాన్ని సబ్బండ వర్ణాలు స్వాగతిస్తున్నాయి. పేద కుటుంబాలకు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇస్తామనడం, తెల్లకార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ రూ.5లక్షల బీమా అమలు చేస్తామనడంపై పేద వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. వృద్ధాప్య, దివ్యాంగ పింఛన్లు, రైతుబంధు సాయాన్ని పెంచుతామని పేర్కొనడంపై ఆయా వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అర్హులైన మహిళలకు ప్రతి నెలా రూ.3 వేల చొప్పున భృతి, పేద మహిళలకు రూ.400కే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ కింద వైద్యపరిమితిని రూ.15లక్షలకు పెం చడం వంటి వరాలతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. మ్యానిఫెస్టో అన్నివర్గాల వారిని సంతృప్తి పరిచేలా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.