బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. భారీ ర్యాలీలు, కార్యకర్తలు, నాయకులతో సమావేశాలు, సభలు నిర్వహిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పార్టీ శ్రేణులు గడపగడపకూ వెళ్లి అభ్యర్థుల తరఫున ఓట్లు అభ్యర్థిస్తున్నారు. బీఆర్ఎస్ సర్కారు తొమ్మిదిన్నరేండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది. అభ్యర్థులకు అడుగడుగునా జనం నీరాజనం పలుకుతున్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను స్వాగతిస్తూ కారు గుర్తుకే తమ ఓటు అని హామీ ఇస్తున్నారు.
గురువారం చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాలె యాదయ్యకు మద్దతుగా షాబాద్లో మంత్రి పట్నం మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాఆశీర్వాద సభను నిర్వహించారు. ఈ సందర్భంగా 2000 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించగా.. ఆ ప్రాంతమంతా గులాబీమయంగా మారింది. షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఫరూఖ్నగర్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. మంత్రి సబితారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి, కల్వకుర్తి అభ్యర్థి జైపాల్ యాదవ్లు పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఏ ఊరిలో చూసినా బీఆర్ఎస్ ప్రచార హోరు.. చేరికల జోరే కనిపిస్తున్నది. ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యేల సమక్షంలో స్థానిక కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో బీఆర్ఎస్లో చేరుతున్నారు. అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న బీఆర్ఎస్ వెంటే ఉంటూ మరోసారి పట్టం కట్టేందుకు కృషి చేస్తామని చెబుతున్నారు.
-రంగారెడ్డి, అక్టోబర్ 26(నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూకుడుగా ముందుకెళ్తున్నది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు నెల రోజుల ముందు నుంచే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రజలతో మమేకమై వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి మరోసారి ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నారు. మరోవైపు గులాబీ శ్రేణులు గడపగడపకూ వెళ్లి అభ్యర్థుల తరపున విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు జనం నీరాజనం పలుకుతున్నారు. షాబాద్లో గురువారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ సూపర్ సక్సెస్ అయ్యింది.
ఓ వైపు బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలను ప్రోత్సహిస్తూనే.. మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థులు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృ తంగా తీసుకెళ్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు రెట్టించిన ఉత్సాహంతో కదం తొక్కుతున్నారు. గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి మరోసారి ఆశీర్వదించాలని కోరుతున్నారు. గురువారం చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాలె యాదయ్యకు మద్దతుగా షాబాద్లో మంత్రి పట్నం మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ సూపర్ సక్సెస్ అయ్యింది. 2,000 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించగా జనం సైతం పెద్ద ఎత్తున తరలివచ్చారు.
షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఫరూఖ్నగర్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి తెలంగాణకు ముందు ఉన్న పరిస్థితు లు, తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించి ఓటు వేయాలని కోరారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య చేవెళ్ల మండలంలో ప్రచారాన్ని నిర్వహించి మరోసారి ఆశీర్వదించాలని కోరారు. మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మె ల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి, కల్వకుర్తి అభ్యర్థి జైపాల్యాదవ్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో అంతర్గత సమావేశాలు నిర్వహిం చి బీఆర్ఎస్ విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఏ ఊరిలో చూసినా చేరికల జోరు కనిపిస్తున్నది. దీంతో క్షేత్రస్థాయిలో పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి ఏకపక్షంగా మారుతున్నది.
సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టో ఎన్నికల ప్రచారంలో కీలకమవుతున్నది. జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు మ్యానిఫెస్టోను ఆదరించి పార్టీ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతును తెలుపుతున్నారు. అర్హులైన మహిళలకు ప్రతినెలా రూ.3వేల చొప్పున భృతి, పేద మహిళలకు రూ.400కే గ్యాస్ సిలిండర్, మహిళా సమాఖ్యలకు సొంత భవనాలను నిర్మించనున్నట్లు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను ఆయా వర్గాలు స్వాగతిస్తున్నాయి. అన్నివర్గాల సమగ్ర అభ్యున్నతే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రకటించిన మ్యానిఫెస్టోతో ఎమ్మెల్యే అభ్యర్థులు, గులాబీ సేన జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నది.