రంగారెడ్డి, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): చేవెళ్ల గడ్డ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు జై కొట్టింది. ఈ ప్రాంతం గులాబీకి అడ్డా అంటూ ప్రజానీకం చాటిచెప్పింది. చేవెళ్ల వేదికగా ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా.. కదం తొక్కిన ప్రజలు ప్రభుత్వ పాలనను ఎండగట్టాలన్న పిలుపునకు సైతం స్పందించి పెద్ద ఎత్తున తరలివచ్చారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలో కేసీఆర్ నిర్వహించిన భారీ బహిరంగ సభ జయప్రదమై గులాబీ దళంలో నూతనోత్తేజాన్ని నింపింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన అశేష జనం బీఆర్ఎస్కు కొండంత బలాన్ని అందించింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు తిరుగులేదని ఈ సభ నిరూపించడంతో చేవెళ్ల లోక్సభ స్థానంలో హ్యాట్రిక్ విజయం ఖాయమన్న ధీమాను నేతలు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ సభతో జిల్లాలో లోక్సభ ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కనున్నది.
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఆది నుంచీ బీఆర్ఎస్ పార్టీ వెన్నంటే ఉంటున్నా రు. ఏ కార్యక్రమం చేపట్టినా అండగా ఉంటున్నారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా..నాలుగింటిలో బీఆర్ఎస్ విజయబావుటా ఎగురవేసి పటిష్టంగా ఉన్నది. మెజార్టీ ఓట్ల పరంగానూ కాంగ్రెస్ కంటే బలంగా ఉన్నది. కాంగ్రెస్ ఐదు నెలల పాలనలో విసిగిపోయిన ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తుండడం క్యాడర్లో సంతోషాన్ని నింపుతున్నది. లోక్సభ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని చేవెళ్ల వేదికగా కేసీఆర్ పూరించగా..
ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఊహించని రీతిలో ప్రజానీకం తరలివచ్చి మద్దతు పలికింది. ప్రజల నుంచి ఏమాత్రం ఆదరణ తగ్గకపోవడం..అధినేతకు జేజేలు పలకడం చూసి గులాబీ శ్రేణులు సంతోషంలో మునిగిపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ వెంటే ఉన్నారని చెప్పడానికి ఇదే నిదర్శనమని నేతలు పేర్కొంటున్నారు. రెండు పర్యాయాలు చేవెళ్ల ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకున్న బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లోనూ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నిలబెట్టిన బీసీ సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించుకుని చరిత్రను తిరగరాస్తామని నేతలు చెబుతున్నారు.
పార్లమెంట్ షెడ్యూల్కు ముందు నుంచే బీఆర్ఎస్ ఇతర పార్టీల కంటే దూకుడుగా ముం దుకు సాగుతున్నది. నాయకులు సమావేశాలు, సమీక్షలు నిర్వహించి క్యాడర్ను ఉత్తేజ పరుస్తున్నారు. అభ్యర్థి కాసాని సైతం ప్రజలతో మమేకం అవుతున్నారు. ఇదే క్రమంలో చేవెళ్ల వేదికగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ బీఆర్ఎస్ విజయవకాశాలపై తీవ్ర ప్రభావా న్ని చూపనున్నది. ఉద్వేగ పూరితంగా సాగిన కేసీఆర్ ప్రసంగం తెలంగాణ ఉద్యమం నాటి రోజులను గుర్తు చేసింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భారంతో ఉన్న కార్యకర్తల్లో నైరాశ్యా న్ని వీడి పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేలా కేసీఆర్ కర్తవ్య బోధ చేశారు. గులాబీ జెండా నే తెలంగాణకు నిజమైన రక్షణ అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రజలను ఆలోచింపజేశా యి. కేంద్ర, రాష్ర్టాల్లోని బీజేపీ, కాంగ్రెస్ల పాలనను కండ్లముందు ఉంచగా..ఇది ప్రజల్లో చర్చకు దారి తీసింది. మొత్తంగా చేవెళ్ల సభ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపింది. ఏదిఏమైనా కేసీఆర్ సభ నింపిన జోష్తో గులాబీ శ్రేణుల ప్రచారం కొత్త పుంతలు తొక్కనున్నదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.