షాబాద్, నవంబర్ 19 : చేవెళ్లలో కారు పార్టీ జోరు మీదుంది. ఎన్నికల ప్రచారంలో గులాబీ పార్టీ దూసుకుపోతున్నది. అభివృద్ధి, సంక్షేమ పథకాలే అస్త్రంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాలె యాదయ్య పల్లెల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తున్నారు. గత తొమ్మిదన్నరేండ్ల కాలంలో చేవెళ్ల నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నారు. అప్పుడు ఎట్లుండే తెలంగాణ.. ఇప్పుడెట్లుంది తెలంగాణ అంటూ నిత్యం జనంతో మమేకమవుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
2014కు ముందు చేవెళ్ల నియోజకవర్గం అభివృద్ధికి ఆమడదూరంలో అన్ని రంగాల్లో వెనుకబడి ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఊహించని రితీలో అభివృద్ధి చెందింది. హనుమంతుడి గుడి లేని ఊరు లేదు..సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదనే నినాదంతో ప్రజల్లోకి దూసుకువెళ్తున్నారు. గత నెల రోజుల నుంచి నియోజకవర్గంలోని షాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, నవాబుపేట్ మండలాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 70 శాతం గ్రామాల్లో ప్రచారం పూర్తి చేసుకున్నారు. వారం రోజుల్లో అన్ని గ్రామాల్లో ప్రచారం విజయవంతంగా పూర్తి చేసేందుకు షెడ్యూల్ తయారు చేసుకుని ముందుకు సాగుతున్నారు.
చేవెళ్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రోడ్షోతో బీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. ఈ నెల 16న నియోజకవర్గ పరిధిలోని మొయినాబాద్ చౌరస్తాలో నిర్వహించిన కేటీఆర్ రోడ్షోకు ఐదు మండలాల నుంచి వేల సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున తరలిరావడంతో రోడ్షో సక్సెస్ అయ్యింది.
ఎమ్మెల్యే యాదయ్య ఆధ్వర్యంలో చేవెళ్ల నియోజకవర్గం ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెందినట్లు, మూడోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని, మంచి వ్యక్తి, సీఎం కేసీఆర్కు అతి సన్నిహితుడు కాలె యాదయ్యను మరోసారి ఆశీర్వదించాలని కేటీఆర్ మాట్లాడటంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. షాబాద్లో జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డి ఆధ్వర్యంలో కాలె యాదయ్యకు మద్దతుగా 2వేల బైకులతో ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 27న చేవెళ్లలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఉంది. దానికి కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ పెద్ద మనస్సుతో అన్ని వర్గాల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలపై బీఆర్ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అమలు జరుగుతున్న పథకాలు ఆసరా ఫించన్లు, రైతు బంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, గృహలక్ష్మి పథకాలతో పాటు కొత్తగా ఆరోగ్యరక్ష, సౌభాగ్యలక్ష్మి, రైతు బంధు పెంపు, పింఛన్లు పెంపు, గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు, అన్నపూర్ణ కార్డుదారులకు సన్నబియ్యం, రూ.15లక్షల బీమా వంటి పథకాలు అమలు చేయనున్నట్లు ప్రజలకు వివరిస్తున్నారు. ఈ పథకాలు కొనసాగాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మూడోసారి రావాలని, అందుకు ప్రజలు మద్దతు తెలపాలని కోరుతున్నారు.
బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి గ్రామాల్లో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఏ గ్రామానికి వెళ్లినా పెద్దఎత్తున బీఆర్ఎస్ అభ్యర్థికి ఘనస్వాగతం పలుకుతున్నారు. తామంతా బీఆర్ఎస్ పార్టీ వెంటే ఉంటామని చెబుతున్నారు. రామక్క పాటకు బీఆర్ఎస్ శ్రేణులు, మహిళలతో పాటు ఎమ్మెల్యే కాలె యాదయ్య కూడా డ్యాన్సులు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. 30న జరిగే ఎన్నికల్లో చేవెళ్ల గడ్డపై గులాబీ జెండా ఎగురవేసేందుకు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజలు సిద్ధమవుతున్నారు.