KTR | ‘కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు కామధేనువు. అటువంటి కాళేశ్వరాన్ని పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయండి. నీళ్లను వెంటనే లిఫ్ట్ చేసి రైతులకు అందించండి. నల్లగొండ సభలో కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు బీఆర్ఎస్ నేతలమంతా మేడిగడ్డకు వచ్చాం. ప్రాజెక్టు రక్షణ చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వమే గోబెల్స్ ప్రచారం నిర్వహిస్తున్నది. దాన్ని అడ్డుకుని ప్రజలకు వాస్తవాలు వివరించేందుకే ఇక్కడికి వచ్చాం. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంపింగ్ స్టేషన్లు, 273 కిలోమీటర్ల పొడవైన టన్నెల్స్, 1500 కిలోమీటర్లకు పైగా ఉండే కాలువలు కలిగిన భారీ ప్రాజెక్టు కాళేశ్వరంలో కేవలం మేడిగడ్డ బ్యారేజీలో 3 పిల్లర్లకు సమస్యలు వస్తే రాద్ధాంతం చేస్తున్నారు’ అని బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ వైఖరిని తూర్పారబట్టారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న దుష్ప్రచారంపై వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పేందుకు బీఆర్ఎస్ నేతలు శుక్రవారం చేపట్టిన చలో కాళేశ్వరంలో భాగంగా ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్రావు, కడియం శ్రీహరి మాట్లాడారు. కేసీఆర్పై కోపముంటే ఆ కోపాన్ని దయచేసి రైతులపై రాష్ట్రంపై చూపవద్దని వారు కోరారు. ఆలస్యం చేయకుండా మేడిగడ్డకు మరమ్మతులు చేయించి రైతులకు సకాలంలో నీళ్లు అందేలా చూడాలని చెప్పారు.