రంగారెడ్డి, ఏప్రిల్ 18(నమస్తే తెలంగాణ) : పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మరింత స్పీడ్ పెంచనున్నది. రైతు సమస్యలే ప్రధాన ఎజెండాగా క్షేత్రస్థాయిలోకి దూసుకెళ్లనున్నది. సీఎం సభలతో పార్టీ క్యాడర్లో కొత్త జోష్ నెలకొనగా.. నామినేషన్ల ప్రక్రియ తర్వాత ఎన్నికల ప్రచారంలో పార్టీ శ్రేణులు మరింత జోరు పెంచనున్నారు.
ఎన్నికల షెడ్యూల్ నుంచే ప్రజలతో, పార్టీ శ్రేణులతో మమేకమై బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు పనిచేస్తుండగా.. సబ్బండ వర్గాల నుంచి విశేష స్పందన వస్తున్నది. చేవెళ్ల, భువనగిరి లోక్సభ ఎన్నికల్లో బీసీ నినాదంతో వెళ్తుండడం కూడా బీఆర్ఎస్కు కలిసి రానున్నది. ఏదేమైనా.. రానున్న రోజుల్లో బస్సు యాత్రలు, కార్నర్ మీటింగ్లతో ఎన్నికల వేడిని రాజేసేలా బీఆర్ఎస్ ప్రచారం ఉంటుందని నేతలు చెబుతున్నారు.
రైతు సమస్యలే ప్రధాన ఎజెండాగా బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఎన్నికల సమరంలోకి దిగుతున్నది. అలాగే.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కేసీఆర్ సంకల్పిస్తున్నారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి ఎండిపోయిన పంటలతో నష్టాల పాలైన రైతుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. రైతులకు జరిగిన నష్టంపై కాంగ్రెస్ ప్రభుత్వం పట్టింపులేకుండా వ్యవహరిస్తుండడాన్ని ప్రజలకు వివరిస్తున్నారు.
చాలా ప్రాంతాల్లో పంటలకు నీరందక ఎండిపోతున్నాయి. ఎండిన గడ్డి జీవాలకు మేతకు తప్ప దేనికీ పనికిరాకుండా పోయాయి. రైతులకు అండగా ఉండేది.. గులాబీ పార్టీ ఒక్కటే అన్న భరోసాను రైతాంగానికి కల్పిస్తున్నారు. అన్ని సభలు, సమావేశాల్లోనూ ప్రస్తుత కరువు పరిస్థితులకు కాంగ్రెస్ సర్కారే కారణమంటూ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలోకి వస్తూనే కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించారంటూ కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు.
పాలమూరు-రంగారెడి ప్రాజెక్టు నుంచి నీటి ఎత్తిపోతను తమ ప్రభుత్వం ప్రారంభిస్తే..కాంగ్రెస్ అసలు పట్టించుకోవడం లేదని, ప్రాజెక్టుల నిర్మాణాల ఊసు కూడా లేదని ప్రచారం చేస్తున్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయడంలేదని, సాధ్యం కాని హామీలిచ్చారని, రైతు బంధు లాంటి పథకాలను పక్కన పెట్టిన కాంగ్రెస్కు ఓటు వేసే విషయంలో ఆలోచించాలని పార్టీ శ్రేణులు ప్రజలకు కర్తవ్య బోధన చేస్తున్నారు. రుణమాఫీ, రూ.500 బోనస్పై పోస్టుకార్డు ఉద్యమం చేపట్టేలా రైతులను బీఆర్ఎస్ చైతన్యపరుస్తున్నది. కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటేనన్న విషయాన్ని ప్రజలకు వివరించడం ద్వారా ఓటర్లను బీఆర్ఎస్ వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
నామినేషన్ల పర్వం ముగిసిన వెంటనే బీఆర్ఎస్ ఎన్నికల వేడిని రాజేయడంతోపాటు విమర్శల వాడితో ప్రతిపక్ష పార్టీలను ఇరుకున పెట్టేలా బీఆర్ఎస్ ప్రచారం ఉండనుందని నేతలు పేర్కొంటున్నారు. మిగతా పార్టీలకంటే ముందే పార్టీ అధినేత కేసీఆర్ గులాబీ శ్రేణులను పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధం చేశారు. సమన్వయ సమావేశాలను నిర్వహించి గెలుపు వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. పార్లమెంటు స్థానానికి సమన్వయకర్తలను సైతం నియమించారు. ఈ నెల 13న చేవెళ్లలో నిర్వహించిన కేసీఆర్ సభ సైతం గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
ఇవన్నీ బీఆర్ఎస్ క్యాడర్లో కొత్త ఉత్తేజాన్ని నింపాయి. ఇదే స్ఫూర్తితో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో మరింత దూకుడును పెంచేందుకు సన్నద్ధులు అవుతున్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలంతా సమన్వయంతో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కృషిచేస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఐదు పార్లమెంటు స్థానాలన్నింటిలోనూ బీఆర్ఎస్ విజయ బావుటా ఎగుర వేసేలా ముందుకు సాగుతున్నారు. ప్రజలతో మమేకమై ముందుకు వెళ్తున్న ఎంపీ అభ్యర్థులకు సబ్బండ వర్గాల నుంచి విశేష స్పందన వస్తుండడం.. పార్టీ శ్రేణులు కదనోత్సాహంతో పనిచేసేందుకు దోహద పడుతున్నది.
గురువారం తెలంగాణ భవన్లో కేసీఆర్ మరోసారి పార్టీ నేతలతో సమావేశమై ఎన్నికల్లో గెలుపుపై దిశానిర్దేశం చేశారు. పార్టీ ఎంపీ అభ్యర్థులు కాసాని, క్యామ మల్లేష్లకు బీ-ఫామ్లను అందజేశారు. కేసీఆర్ దిశా నిర్దేశం మేరకు కాంగ్రెస్, బీజేపీల వైఫల్యాలను ఎండగట్టేలా ప్రచార వ్యూహాలను నేతలు సిద్ధ్దం చేసే పనిలో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలో బస్సు యాత్రలు, రోడ్డు షోలు, కార్నర్ మీటింగులను నిర్వహించనున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు వంటి ముఖ్యనేతల పర్యటనలతో ఎన్నికల ప్రచారంలో కారు టాప్ గేరులో దూసుకుపోనున్నది.