యాలాల, ఏప్రిల్ 6 : రైతు సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల అనుసరిస్తున్న ఉదాసీన వైఖరికి నిరసనగా జంగ్ సైరన్ మోగించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు నైతన్నలకు మద్దతుగా రైతు దీక్షల్లో పార్టీ శ్రేణులు అన్నదాతకు అండగా మేమున్నామంటూ రైతులకు భరోసా కల్పించారు. యాలాల మండల పరిధిలోని లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాపై శనివారం పార్టీ కార్యకర్తలు రైతు దీక్ష నిర్వహించారు.
గ్రంథాలయ వికారాబాద్ జిల్లా మాజీ చైర్మన్ రాజుగౌడ్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ సాగునీరు అందక, కరెంటు లేక లక్షలాది ఎకరాల్లో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంట ఎండిపోయిన రైతులకు ఎకరానికి రూ.25వేలు ఇవ్వాలని, వరి, మక్కలకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని, రైతులకు వెంటనే రూ.2 లక్షల ఋణమాఫీ చేయాలని, రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇవ్వాలన్నారు.
ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువన్నారు. సాగునీరు అందక వేల ఎకరాల్లో పంట ఎండిపోయి రైతులు అరిగోస పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతున్నా హామీలను అమలు చేయకపోగా, రైతులను ఇష్టారీతిగా అవమానాలకు గురిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.