బడంగ్పేట, ఏప్రిల్ 9 : రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడ మున్సిపాలిటీ, మంచాల, నందిగామ మండల కేంద్రాల్లో ఆత్మీయ సమ్మేళనాలు హోరెత్తాయి. డప్పు చప్పుళ్లు, డోలువాయిద్యాలతో పెద్ద ఎత్తున ర్యాలీలు, కళాకారుల ఆటాపాటలతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొన్నది. జై తెలంగాణ, జైజై కేసీఆర్ అన్న నినాదాలు మార్మోగాయి. ఆత్మీయ సమ్మేళనాలకు పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమాలు జరిగే ప్రాంతాలన్నీ పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో గులాబీమయమయ్యాయి. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని బీఆర్ఎస్కు తిరుగులేదు.. మళ్లీ గెలుపు ఖాయమన్న చర్చలు వినిపించాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ సంపదను దోచి ఆదానీ జేబులు నింపుతున్నాడు తప్ప తెలంగాణ రాష్ర్టానికి పైసా ఇవ్వడం లేదని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మి గార్డెన్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. డప్పుల దరువులు, దూందాం కళాకారుల ఆట పాటలతో ఆత్మీయ సమ్మేళనం అదరహో అనిపించింది. మంత్రిని భారీ గజమాలతో సత్కరించారు. ఈ సమావేశానికి తుక్కుగూడ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టానికి వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై విషం కక్కడమే ప్రధాన ఎజెండాగా ఎంచుకున్నారని ఆమె మండి పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశ మంతా అమలు చేసి మాట్లాడాలని ఆమె సవాల్ విసిరారు. రైతు మరణిస్తే ఐదులక్షల బీమా ఇస్తున్నామన్నారు.
రైతుబీమాను దేశమంతా అమలు చేసి ఐదులక్షలు ఇవ్వాలన్నారు. ప్రజల మద్యన విద్వేశాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు. హిందూ, ముస్లిం, మందిర్ మజీద్ పేరుతో ప్రజల మద్యన చిచ్చుపెడుతున్నారని అన్నారు. తుక్కుగూడకు ఎందుకు ఐటీఐఆర్ ఇవ్వలేదో బీజేపీ నాయకులు చెప్పాలన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని, కాళేశ్వరం ప్రాజెక్కుకు నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధాన మంత్రిని కలిసి విన్నవించినా పైసా ఇవ్వలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి గురించి కేసీఆర్ కుటుంబంపై విష ప్రచారం చేయడానికి కంకణం కట్టుకున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు ఎందుకు తగ్గించడం లేదో ప్రజలు నిలదీయవలసిన అవసరం ఉందన్నారు.
ప్రతి ఇంటికీ తాగునీరు..
తుక్కుగూడ మున్సిపాలిటీలో మంచి నీటి సమస్య ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో తాగునీటి సమస్య కోసం రూ.30లక్షలు మంజూరు చేయించారని ఆమె గుర్తు చేశారు. మంచినీటి పైపులైన్లు, రిజర్వాయర్లు నిర్మాణం చేయడం జరిగిందన్నారు. గోదావరి, కృష్ణ నీళ్లను తీసుకొచ్చి ప్రజల దాహర్తిని తీరుస్తున్న ముఖ్యమంత్రిపై మోదీ ఎందుకు విషయం కక్కుతున్నారని ఆమె ప్రశ్నించారు. రావిర్యాలలో ఐటీ ఐఆర్ కంపెనీ ఎందుకు పెట్టలేదో బీజేపీ నాయకులు చెప్పాలన్నారు. మంజూరు చేసిన ఐటీఐఆర్ను ఎందుకు రద్దు చేశారో బీజేపీ నాయకులు వివరణ ఇవ్వాలన్నారు.
మరో హైటెక్ సిటీగా తుక్కుగూడ
తుక్కుగూడ మున్సిపాలిటీ మరో హైటెక్ సీటీగా మారబోతుందని మంత్రి పేర్కొన్నారు. తక్కుగూడకు కొత్తగా 52 కంపెనీలు వస్తున్నాయన్నారు. ప్రాంతంలో ఉన్న లక్షల మందికి ఉపాధి అవకాశాలు మెరుగు పడుతాయన్నారు. ఐదలక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇంత వరకు ఎందుకు ఇవ్వలేదన్నారు. తొమ్మిది సంవత్సరాలకు 18కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలన్నారు.
ప్రజా సంక్షేమమే బీఆర్ఎస్ ధ్యేయం
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన అందిస్తున్నారని రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ ఇన్చార్జి ఎల్ రమణ అన్నారు. రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన పథకాలు దేశంలో ఎక్కడా అమలు అవుతున్నాయో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చెప్పాలన్నారు. దేశ సంపదను కార్పోరేట్, పెట్టుబడి దారులకు ధారదత్తం చేస్తున్నారని ఆయన మండి పడ్డారు. బీజేపీ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టవలసిన అవసరం ఉందన్నారు. నిరంతర విద్యుత్ ఏ రాష్ట్రంలో అమలు చేస్తున్నారో బీజేపీ నాయకులు చెప్పాలన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేసి సబితా ఇంద్రారెడ్డిని, ఎంపీ రంజిత్రెడ్డిని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ చేరాలి..
మహేశ్వరం నియోజకవర్గంలో ఎవరైనా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు తప్పవని రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి హెచ్చరించారు. పార్టీ పరువు తీసే నాయకులు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రతి గడపకు చేరడం జరిగిందన్నారు. ఈ పథకాలను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక ప్రధాన మంత్రి సైతం తప్పుడు ఆరోపణలు చేయడం దురదుష్ట కరమన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ నాయకులను నిలదీయండి
తెలంగాణ రాష్ర్టానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఎంచేసిందో కాలనీలకు, గ్రామాలకు వస్తున్న బీజేపీ , కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్ అన్నారు.
కేంద్రం మోటర్లకు మీటర్లు పెడుతామని చెబితే అందుకు ముఖ్య మంత్రి కేసీఆర్ ఒప్పుకోక పోవడం వల్లనే కేంద్రం ముఖ్యమంత్రిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రైతులు పండించిన ధాన్యం కొనమంటే ఎందుకు కొనలేదో చెప్పాలన్నారు. రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మహేశ్వరం నియోజకవర్గం ప్రధాన కార్యదర్శులు బి.బాలకిషన్, అరవింద్శర్మ, ఉపాధ్యక్షుడు చంద్రయ్య, తుక్కుగూడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ భవానివెంకట్రెడ్డి, కౌన్సిలర్స్ బి.తేజస్వీని శ్రీకాంత్గౌడ్, లావణ్యరాజు, సుమన్, దాదవత్ రవినాయక్, బీఆర్ఎస్ నాయకులు రాజునాయక్, లక్ష్మినర్సింహ, అంజయ్య, పవన్, బషీర్దీన్ పాల్గొన్నారు.