‘అన్ని పంటలకు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.. ఈ మేరకు యాసంగి ధాన్యానికి రూ.500 బోనస్ కచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే.. లేదంటే వెంటాడుతాం.. ఈ విషయంలో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులంతా ప్రభుత్వాన్ని నిలదీయాలి’ అని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు రైతాంగానికి రంగారెడ్డి జిల్లా గులాబీ దళం వెన్నుదన్నుగా నిలిచేందుకు సన్నద్ధమవుతున్నది. డిమాండ్ల సాధనే లక్ష్యంగా మరో ఉద్యమానికి జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు నడుం బిగించాయి.
-రంగారెడ్డి, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ)
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్కు వినతిపత్రాలను అందజేయనున్నారు. ఈనెల 6న ప్రతి మండల కేంద్రంలోనూ రైతులతో దీక్షలు నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు చేపట్టిన ఈ కార్యక్రమాల్లో రైతాంగం సైతం పెద్దఎత్తున పాల్గొని నిరసన గళం విప్పేందుకు సమయత్తమవుతున్నది.
కాంగ్రెస్ వంద రోజుల పాలనలోనే వ్యవసాయ రంగం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జలాలు అడుగంటి కరువు తాండవిస్తున్నది. పంటలకు తడి అందక ఎండిపోయి పశువులకు మేతగా మారుతున్నాయి. పంటలను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో తిప్పలు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో దిగుబడులు సైతం వచ్చే పరిస్థితి లేక రైతుల కష్టం అగ్గిపాలవుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరువు అనే మాట లేకపోగా.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కష్టాలు రైతులను వెక్కిరిస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో రైతు భరోసా, రుణ మాఫీ హామీలను ఇచ్చి రైతులను నమ్మించిన కాంగ్రెస్.. మాట నిలుపుకోకపోవడంతో రైతు కుటుంబాలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. చేతికొస్తున్న కొద్దిపాటి పంటలను సైతం అమ్ముకునేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు వ్యాపారులకు తక్కువ ధరకే అముకోవాల్సి వస్తున్నది. ఓ వైపు సాగు నీటి కష్టాలు, మరోవైపు కరెంటు కోతలతో పదేండ్లుగా మాయమైపోయిన రైతు కష్టాలు నేటి కాంగ్రెస్ పాలనలో మళ్లీ ప్రత్యక్షమవుతున్నాయి.
రైతు ప్రయోజనాలే ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వం పండిన ప్రతి గింజనూ కొని రైతులకు గిట్టుబాటు ధర కల్పించింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో మద్దతు ధర రైతులకు దక్కకుండా పోతున్నది. ఎండిపోగా.. పండిన కాస్తంత పంటకైనా బోనస్ ఇచ్చి ఆదుకోవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇది ఎన్నికల నాటి హామీయే అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపు లేకుండా పోయింది.
కరువు పరిస్థితుల్లో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల కన్నా పార్లమెంటు ఎన్నికలే ముఖ్యం అన్నట్లుగా.. ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తుండడం రైతాంగానికి ఆగ్రహం తెప్పిస్తున్నది. ఈ పరిస్థితుల్లో గుండె చెదిరిన రైతన్నకు బాసటగా నిలవాలని సంకల్పించిన కేసీఆర్ స్వయంగా తానే రంగంలోకి దిగారు. రైతాంగం కోసం పోరుబాట పట్టారు. కరువు పరిస్థితులు నెలకొని ఎండిపోతున్న పంటలతో అరిగోస పడుతున్న రైతాంగానికి భరోసా కల్పించేందుకు ఇప్పటికే సూర్యాపేట, జనగామ జిల్లాల్లో పొలం బాట పట్టారు.
ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించుకుని ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్ పిలుపు మేరకు.. రంగారెడ్డి జిల్లాలో మంగళవారం నిర్వహించే కలెక్టర్కు వినతి పత్రాల సమర్పణతోపాటు 6న నిర్వహించే దీక్షలను విజయవంతం చేసేలా పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చి బోనస్ ఇచ్చే వరకు నిరసన కార్యక్రమాలను బీఆర్ఎస్ పార్టీ కొనసాగించనున్నది.