బొంరాస్పేట : మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్లు జోరుగా కొనసాగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి తాసిల్దార్ కార్యాలయంలో సందడి నెలకొంది. వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన వారు వాటిని రిజిస్ర్టేషన్ చేసుకోవడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వ్యవసాయ భూములు, ఓపెన్ ప్లాట్ల ధరలను ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రభుత్వం పెంచుతుందన్న ప్రచారంతో భూములు కొనుగోలు చేసిన వారు వాటిని రిజిస్ర్టేషన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. భూముల ధరలు పెరిగితే రిజిస్ట్రేషన్ రుసుము కూడా పెరిగి భారం పడుతుందన్న ఉద్దేశంతో కొనుగోలుదారులు ముందు జాగ్రత్తగా నెలాఖరులోగా రిజిస్ర్టేషన్ చేసుకుంటున్నారు.
అమ్మకందారులు, కొనుగోలుదారులు పెద్ద ఎత్తున వస్తుండటంతో తాసిల్దార్ కార్యాలయం రద్దీగా మారుతుంది. కొన్ని రోజులుగా భూములు రిజిస్ర్టేషన్ చేసుకునేందుకు రోజూ 25నుంచి 30మంది స్లాట్ బుక్ చేసుకుంటున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా రిజిస్ర్టేషన్లు జరుగుతుండటంతో ధరణి సర్వర్ తరుచూ మొరాయిస్తుంది. దీంతో బుక్ చేసుకున్న స్లాట్ ప్రకారం రిజిస్ర్టేషన్ కావడం లేదని కొనుగోలుదారులు చెబుతున్నారు. సర్వర్ సతాయించకుంటే ప్రతిరోజూ 30వరకు రిజిస్ర్టేషన్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.