షాద్నగర్, జూలై 25 : తెలంగాణలో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగిందని, బీఆర్ఎస్ పాలన తీరుకు అన్ని వర్గాల ప్రజలు ఆకర్షితులై స్వచ్ఛందగా పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మంగళవారం షాద్నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఫరూఖ్నగర్ మండలం గంట్లవెల్లి గ్రామానికి చెందిన బీజేపీ, బీఎస్పీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ప్రజల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ పాలన కొనసాగుతున్నదన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తుందన్నారు. బీజేపీ కి చెందిన అఖిల్, అశోక్, నందీశ్వర్, శివకుమార్, విశాల్, వినోద్, ప్రవీణ్, రాఘవేందర్, ఆనంద్, హరికృష్ణ, కమ్మరి రఘులతో పాటు బీఎస్పీ కి చెందిన శివకుమార్, ఎర్రోళ్ల బాలరాజు, చరికొండ శ్రీనివాసులు, మిద్దెల నర్సింహ, వీరేందర్, శ్రీశైలం, ప్రశాంత్, రవి, రఘునాథ్, ప్రేమ్కుమార్, వెంకటయ్య, కృష్ణ ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్, ఎంపీపీ ఖాజా ఇద్రీస్, రంగయ్యగౌడ్ పాల్గొన్నారు.
గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతా
షాద్నగర్రూరల్ : ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఫరూఖ్నగర్ మండలంలోని కుందేలుకుంట, నేరళ్లచెరువు, చింతగూడ గ్రామాల్లో పల్లెబాట కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి పాలనలో తండాలు, గ్రామీణ ప్రాంతాలను కేవలం ఓటు బ్యాంక్గా మాత్రమే వినియోగించుకోవడంతో అభివృద్ధికి నోచుకోలేదన్నారు. తెలంగాణ ఏర్పడ్డాకే గ్రామాలు, తండాల రూపురేఖలు మారాయని వివరించారు. పరిపాలన సౌలభ్యం కోసం 500 జనాభా కలిగిన తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా గుర్తించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. అభివృద్ధి పనులతో నేడు గ్రామాల రూపురేఖలు మారాయయని ఆయన వివరించారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఫరూఖ్నగర్ మండలంలోని కుందేలుకుంట తండాలో రూ.20 లక్షలతో నిర్మించనున్న గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులు, చింతగూడ గ్రామంలో రూ.15లక్షలతో నిర్మించనున్న ఎస్సీ కమిటీహాల్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ శంకుస్థాపన చేశారు.
గొర్రెల పంపిణీ
అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఎదుగుదలకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మండలంలోని చింతగూడ గ్రామంలో 69 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశారు. గొల్లకురుమల ఆర్థిక ఎదుగుదల కోసం దేశంలో ఎక్కడా లేని విధంగ ప్రభుత్వం గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టిందన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, ఎంపీపీ ఖాజా ఇద్రీస్ అహ్మద్, వైస్ ఎంపీపీ మౌనిక, ఆయా గ్రామాల సర్పంచ్లు రవీందర్, సత్యనారాయణయాదవ్, కల్పన, నాయకులు బాలూనాయక్, ఆనంద్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.