యాచారం, డిసెంబర్ 3: యువత ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని హంపి పీఠాధిపతి శ్రీవిరూపాక్ష విద్యారణ్యభారతి స్వామీజీ అన్నారు. మండల కేంద్రంలోని యజ్ఞవల్క్య ఆశ్రమంలో రామాలయం ఎదుట రామకోటి స్తూపం నిర్మాణానికి శనివారం ఆయన భూమిపూజ చేశారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు అధి క సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 7 గంటలకు పతాకావిష్కరణ, 8.30 నుంచి సామూహిక గీతాపారాయణం, 10 గంటలకు శ్రీరామకోటి జపయజ్ఞం, 11.30 గంటలకు రామకోటి స్తూపానికి శంకుస్థాపన, మధ్యాహ్నం 12 గంటలకు స్వామీజీ ప్రవచనాలు, మధ్యా హ్నం 1.15 మహాప్రసాద వితరణ, హోమం తదితర కార్యక్రమాలను అర్చకులు వేద మంత్రాల మధ్య భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా భారతి స్వామీజీ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలన్నారు.
పురాతన ఆలయాల పునర్నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. హిందూ ఆలయాలను పరిరక్షించాలని, ఆలయాల నిర్మాణంతో ప్రజల్లో ఆధ్యాత్మిక భావన పెంపొందుతుందన్నారు. దాతల సహకారంతో యాచారంలో రామాలయ నిర్మాణానికి కృషి చేస్తున్న విష్ణుమూర్తిని ప్రశంసించారు. అదేవిధంగా తిరుమలేశుడి గుట్టపై ఉన్న వేంకటేశ్వరాలయాన్ని కూడా అభివృద్ధి చేయాలని స్వామీజీ ప్రజలకు సూచించారు. నందివనపర్తిలో జ్ఞాన సరస్వతీదేవి మందిరాన్ని విద్యార్థుల సహకారం తో నిర్మించడం అభినందనీయమన్నా రు. కార్యక్రమంలో రామకోటి ఆశ్రమం దయానందగిరి స్వామీ జీ, మాతా పఠావిద్యానందగిరి, ఉత్తర పీఠాధిపతి లక్ష్మీనారాయణ, శివానంద స్వామీజీ, గ్రామ సర్పంచ్ శ్రీధర్రెడ్డి, జ్ఞాన సరస్వతీదేవి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సదా వెంకట్రెడ్డి, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.