అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ ప్రధాన నియోజకవర్గాలపై బెట్టింగ్లు ఊపందుకున్నాయి. ఇవి ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికో, పక్కనున్న ఎల్బీనగర్ నియోజకవర్గానికో పరిమితం కాలేదు. రాష్ట్రంలో హాట్ టాపిక్ అయిన, ప్రధాన అభ్యర్థులు, ప్రముఖులు నిల్చున్న చాలా నియోజకవర్గాలపై ఇక్కడ పల్లెల్లోనూ బెట్టింగులకు దిగుతున్నారు. ‘అన్నా.. ఏమంటవే.. ఏది గెలుస్తది.. బెట్టు కట్టిన.. వొస్తయంటవా పైసల్’ అంటూ తెలిసినోళ్లకు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు. మరికొందరు టీవీలో చర్చలు, యూట్యూబుల్లో విశ్లేషణలు అదేపనిగా చూసేస్తున్నారు. నేడు ఫలితాలు వెలువడనుండగా.. సామూహికంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
పెద్దఅంబర్పేట, డిసెంబర్ 2 : ‘అన్నా తెలంగాణల.. గెలిచేది కారే.. వచ్చేది సారే’… ‘ చెయ్యిదే పైచేయి గుర్తుంచుకో అన్నా.. తెలంగాణల దానిదే హవా బెట్టుకు రెడీ’ ఇలా తెలంగాణ మొత్తంపై బెట్టింగ్లు జోరుగా నడుస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వేళ ప్రధాన నియోజకవర్గాలపై బెట్టింగ్లు ఊపందుకున్నాయి. ఇవి ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికో, పక్కనున్న ఎల్బీనగర్ నియోజకవర్గానికో పరిమితం కాలేదు.
రాష్ట్రంలో హాట్ టాపిక్ అయిన, ప్రధాన అభ్యర్థులు, ప్రముఖులు నిలబెడిన చాలా నియోజకవర్గాలపై బెట్టింగులకు దిగుతున్నారు. ‘అన్నా.. ఏమంటవే. ఏది గెలుస్తది. బెట్టు కట్టిన.. వొస్తయంటవా పైసల్’ అంటూ తెలిసినోళ్లకు ఫోన్లు చేసి ఆరా తీస్తున్నారు. మరికొందరు టీవీలో చర్చలు, యూట్యూబుల్లో విశ్లేషణలు తదేకంగా చూసేస్తున్నారు. సర్వేల్లో ఫలితాలు చూసి మురిసిపోతున్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాలుగోసారి విజయం సాధిస్తుందని కొందరు, ఈసారి సీటును కొట్టేది కాంగ్రెస్సేనని మరికొందరు బెట్టింగులు కాస్తున్నారు. ఇంటర్ పూర్తయిన యువకుడి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారుల వరకు పందేలు కాసేందుకు ఇష్టపడుతున్నారు. ఆ బెట్టింగ్లు రూ.5 వేలు మొదలుకొని రూ.లక్ష వరకు కాస్తున్నారు. బెట్టింగ్ కట్టి ఊరుకోవడంలేదు.
అసలు గెలుపునకు ఏయే అంశాలు దోహదం చేస్తాయి, ఎలా దోహదం చేస్తాయో సైతం తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒకే పార్టీకి చెందిన మరికొందరు గెలుపు పక్కా అయిపోయింది, మెజార్టీపై బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. బెట్టింగ్లు పెరగడంతో ఎన్నికల ఫలితాలపై మరింత ఉత్కంఠ పెరిగింది.
సర్వేలు పూర్తి మెజార్టీ ఎవ్వరికీ ఇవ్వకపోవడం, కౌంటింగ్కు ఆదివారం కలిసి రావడంతో ప్రజల్లో మరింత ఆసక్తి పెరిగింది. పార్టీల వారు ఒకేచోట పార్టీ కార్యాలయాల నుంచి ఫలితాలు చూడాలని నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంచితే, యువకులు, రియల్టర్లు ఎవరికి వారు ఒకేచోట నుంచి ఫలితాలను వీక్షించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరో వరల్డ్ కప్ ఫైనల్ను తలపించేలా ముందుగానే అంతా సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకోసం మందు, భోజనాలు సైతం ఒకేచోట చేసేలా సన్నద్ధమవుతున్నారు.
మున్సిపాలిటీ ప్రజలే కాదు, జిల్లాలోని చాలామంది రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో ఫలితాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులో ముఖ్యంగా కామారెడ్డి, గజ్వేల్, కొడంగల్, కోరుట్ల, సిరిసిల్ల, ఎల్బీనగర్, మహేశ్వరం, కల్వకుర్తి, మహబూబ్నగర్, కొల్లాపూర్, మునుగోడు, మేడ్చల్, పాలేరు.. ఇలా మరెన్నో నియోజకవర్గాల్లో ఫలితాలపై ఆసక్తిగా ఉన్నారు.
అక్కడ ఎవరు గెలుస్తారు, ఎంత మెజార్టీ వస్తుంది, ఎలా సాధ్యం.. ఇలా పలు అంశాలపై విశ్లేషణలు చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో గెలుపోటములపైనా ఇక్కడ బెట్టింగ్లు పెడుతున్నారు. ఈ బెట్టింగుల ఫలితాలకు మరికొన్ని గంటల్లోనే ఫుల్స్టాప్ పడనున్నది.