బడుగులను అణగదొక్కేందుకు చేస్తున్న కాంగ్రెస్ కుట్రలపై బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. కుల కుంపటిని రాజేస్తున్న ఆ ఆపార్టీ నేతలపై బీసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా బీసీలంతా ఏకతాటి పైకి రావాల్సిన ఆవశ్యకతను వారు తెలియజేస్తున్నారు. ‘బీసీ అభ్యర్థిని ఎలా గెలిపిస్తారో చూస్తాం’ అన్న కాంగ్రెస్ నేతల దురహంకార మాటలను సవాల్గా తీసుకుని బీసీల సత్తాను నిరూపించాల్సిన సమయం వచ్చిందంటున్నారు. రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల్లో 6 స్థానాలను బీసీలకు కేటాయించి సామాజిక న్యాయాన్ని పాటించిన కేసీఆర్ గొప్పతనాన్ని బీసీ నేతలు కొనియాడుతున్నారు.
చేవెళ్లలో బీసీ అభ్యర్థిని గెలిపించుకుని బీసీల దమ్మేంటో చూపిస్తామని స్పష్టం చేస్తున్నారు. బీసీ వర్గాలను అవమానించేలా మాట్లాడితే నాలిక కోస్తామని హెచ్చరిస్తున్నారు. బడుగులను చులకన భావంతో చూస్తున్న కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెబుతున్నారు. మన ఓటు మన బీసీ అభ్యర్థికి వేసుకుని గెలిపించుకుందామని పిలుపునిస్తున్నారు. జనాభాలో మెజార్టీగా ఉన్న బీసీల గొంతుక పార్లమెంటులో వినబడాలంటే బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఎంపీగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు.
– రంగారెడ్డి, ఏప్రిల్ 15(నమస్తే తెలంగాణ)
చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో బీసీల సత్తా చాటుతాం. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతోకాలంగా కృషి చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్కే మా మద్దతు. బీసీలపై అహంకార పూరితంగా మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు బీసీల ఓట్లు లేకుండా ఎలా గెలుస్తారో చూస్తాం. బడుగుబలహీన వర్గాల ప్రజలను చులకనగా చూస్తున్న రాజకీయ పార్టీలు, నేతలకు ఓటుతో తగిన బుద్ధి చెబుతాం.
– డి.గోపాల్, రామయ్యగూడ, వికారాబాద్
కాంగ్రెస్ నాయకులు బీసీలను అవహేళన చేయడం సరికాదు. బీసీలు కనికరించకపోతే కాంగ్రెస్కు అధికారం దక్కేదా..? ఇంత అహంకారం పనికిరాదు. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ నాయకుల అసలు రూపం బయటపడుతున్నది. ఎంపీ ఎన్నికల్లో గుణపాఠం తప్పదు. బీసీల సత్తా చూపాలి. బీసీలందరూ ఏకమై మన బీసీ అభ్యర్థికి భారీ విజయాన్ని అందిద్దాం.
– శ్రీనివాస్యాదవ్, మూలమాడ, నవాబుపేట
బీసీ గళం వినిపించాల్సిన సమయం వచ్చింది. అగ్రవర్ణ రాజకీయ నాయకుల వక్రబుద్ధికి సమాధానం చెప్పే ఆయుధమైన ఓటు మన చేతిలోనే ఉన్నది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన బీసీల ముద్దుబిడ్డ కాసాని జ్ఞానేశ్వర్కు ఓటు వేసి భారీ మెజార్టీని అందిస్తాం. కాసాని గెలుపుతో మన బీసీల గొంతుక లోక్సభలో వినిపిస్తుంది.
– సి.తిరుపతి, ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు, యాలాల
ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కాసానికి బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల ఎంపీ టికెట్ ఇవ్వడం సంతోషంగా ఉన్నది. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించుకొని బీసీ వాదాన్ని నిరూపిస్తాం. బీసీలను చిన్న చూపుచూస్తున్న పార్టీలకు కనువిప్పుకలిగేలా ఈ ఎన్నికల్లో కాసానిని గెలిపించుకుంటాం. బీసీల ఐక్యతగా అంటే ఎలా ఉంటుందో అందరికీ అర్థమయ్యేలా చేస్తాం.
– సందని రామకృష్ణ, జిల్లా ముదిరాజ్ సంఘం నాయకుడు, ముజాహిద్పూర్, కులకచర్ల
రాష్ట్రంలో 70 శాతం ఉన్న బీసీల సత్తా ఎంటో పార్లమెంట్ ఎన్నికల్లో చూపించాలి. బీసీలను కించపరిచేలా మాట్లాడిన మోహన్రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలంటే చేవెళ్ల పార్లమెంట్ బరిలో ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ముదిరాజ్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. బీసీల సమస్యలు పరిష్కారం కావాలంటే అది బీసీ ఎంపీలతోనే సాధ్యమవుతుంది.
– కంచర్ల శేఖర్, ఆర్కేపురం డివిజన్ వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు
పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలంతా ఏకతాటిపైకి రావాలి. చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ తరుఫున ముదిరాజ్ బిడ్డ కాసాని జ్ఞానేశ్వర్కు అవకాశం కల్పించడం సంతోషకరం. బీసీలకు దమ్ముంటే కాసానిని ఎంపీగా గెలిపించుకోవాలని ఓ నాయకుడు విసిరిన సవాల్కు మనమందరం ఏకమై ఓటు ద్వారా సమాధానం చెప్పాలి.
– ననాజీపురం లింగం, ముదిరాజ్ సంఘం షాబాద్ మండల అధ్యక్షుడు
బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ను చేవెళ్ల ఎంపీ అభ్యర్ధిగా బీఆర్ఎస్ ప్రకటించడం హర్షణీయం. బీసీలందరం సమష్టిగా కృషి చేసి జ్ఞానేశ్వర్ను గెలిపించుకుంటాం. ఆయన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చైర్మన్గా ఉన్నప్పుడు బీసీల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. జ్ఞానేశ్వర్ గెలుపు చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గానికి ఎంతో అవసరం.
– విజయ్కుమార్, హైదర్గూడ
బీసీలంతా ఐక్యంగా ఉండి ఎన్నికల్లో వెనకబడిన వర్గాల అభ్యర్థులకు అండగా నిలువాల్సిన అవసరం ఎంతో ఉన్నది. చేవెళ్ల పార్లమెంటు స్థానాన్ని కేసీఆర్ బీసీ వర్గానికి చెందిన కాసానికి ఇచ్చి ఆ వర్గాలపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. కాంగ్రెస్, బీజేపీలు మాత్రం అందుకు భిన్నంగా అగ్రకులాలకు చెందిన వారికి టికెట్లు కేటాయించాయి. అందుకే కాసానిని గెలిపించుకోవాలి.
– అందె నర్సింహ
పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు జడ్పీ చైర్మన్గా, ఎమ్మెల్సీగా సేవ చేసిన అనుభవం జ్ఞానేశ్వర్కు ఉన్నది. అత్యధికంగా ఉన్న బీసీలంతా పార్టీలకతీతంగా ఏకమై కాసానిని గెలిపించుకుంటాం.
– పి.కుమార్యాదవ్, బీసీ నేత, కుమ్మరిగూడ, షాబాద్ మండలం
చేవెళ్ల స్థానంలో బీసీ అభ్యర్థికి ఓటేసి బీసీల సత్తా చాటుతాం. కాసాని గతంలో 96 బీసీ కులాలను ఒక్క చోటుకి తెచ్చి ఐక్యవేదిక ఏర్పరిచారు. బీసీలను అవమాన పర్చేలా కాంగ్రెస్ పార్టీ దురహంకార మాటలు బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. కాసానికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి.
– శ్రీనివాస్ గౌడ్, తాండూరు మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్
రానున్న ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్ను చేవెళ్ల నుంచి గెలిపించుకొని బీసీల ఐక్యతను చాటుతాం. బీసీలపై కొందరు నాయకుల వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీసీలకు పెద్దపీట వేసి ఆరు ఎంపీ సీట్లు కేటాయించడం అభినందనీయం. బీసీలను విస్మరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి తగినబుద్ధి చెబుతాం. మారోజు రామాచారి, విశ్వకర్మ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
వెనకబడిన వర్గాల ఐక్యతను చాటుకోవటం ద్వారా బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలి. అప్పుడే భవిష్యత్లో మరింత మంది బీసీలకు అవకాశాలు వస్తాయి. కేవలం ఓటు బ్యాంకుగా వాడుకునే రాజకీయ పార్టీల మాటలను నమ్మి మోసపోకుండా బీసీలు ఐకమత్యంతో ముందుకెళ్లాలి.
– సత్యనారాయణ, మున్నూరు కాపు సంఘం మాజీ అధ్యక్షుడు
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీసీల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసింది. కానీ, కాంగ్రెస్ అధికారం చేపట్టిన కొన్ని రోజులకే ఆ పార్టీ నేతలు అహంకార ధోరణితో విర్రవీగుతున్నారు. బీసీలను తక్కువ చేస్తూ కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం సిగ్గుచేటు. చేవెళ్లలో బీసీ అభ్యర్థికి ఓటేసి కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధిచెబుతాం.
– శ్రీనివాస్గౌడ్, అత్తాపూర్