వికారాబాద్, సెప్టెంబర్ 26, (నమస్తే తెలంగాణ): రూ.లక్షలోపు పంట రుణాలు మాఫీ అయిన ప్రతి రైతుకూ సంబంధించి పంట రుణాలను రెన్యువల్ చేసేందుకు ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా ఉన్నతాధికారులు జిల్లాలో అర్హులైన ప్రతీ రైతుకు పంట రుణాలను మంజూరు చేసేలా చర్యలు చేపట్టారు. బ్యాంకుల వారీగా పంట రుణాలు పూర్తైన రైతుల వివరాలను సేకరిస్తున్న లీడ్ బ్యాంకు అధికారులు సంబంధిత రైతులందరికీ రుణాలను రెన్యువల్ చేసేలా చర్యలు వేగవంతం చేశారు. జిల్లాలోని పంట రుణాలను మంజూరు చేసిన అన్ని బ్యాంకులు పంట రుణాలు మాఫీ అయిన రైతులకు సంబంధించి పంట రుణాలను వెంటనే రెన్యువల్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం బ్యాంకుల వారీగా రూ.లక్షలోపు పంట రుణాలు మాఫీ అయిన రైతుల వివరాలతోపాటు రెన్యువల్ అయిన రైతుల వివరాలను జిల్లా లీడ్ బ్యాంకు అధికారులు, వ్యవసాయాధికారులు సేకరిస్తూ ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 39 శాతంమేర రైతుల పంట రుణాలను రెన్యువల్ ప్రక్రియను పూర్తి చేశారు. అయితే రూ.లక్షలోపు పంట రుణాలు మాఫీ అయిన రైతుల్లో ఇప్పటివరకు 25,158 మంది రైతులకు పంట రుణాలను రెన్యువల్ ప్రక్రియను పూర్తి చేశారు. అదేవిధంగా పంట రుణాలు మాఫీ అయిన రైతులకు పంట రుణాలను రెన్యువల్ ప్రక్రియను పూర్తి చేసి జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు రూ.156.39కోట్ల పంట రుణాలను బ్యాంకర్లు మంజూరు చేశారు.
రూ.లక్షలోపు పంట రుణాలు మాఫీ అయిన రైతులకు వెంటనే రుణాలను రెన్యువల్ చేసేలా అవసరమైన చర్యలు చేపట్టాం. పంట రుణాలు మాఫీ అయిన రైతుల్లో ఇప్పటివరకు 39 శాతం మేర రైతులకు రెన్యువల్ చేసి పంట రుణాలను బ్యాంకర్లు మంజూరు చేశాయి. అదేవిధంగా అర్హులైన ప్రతి రైతుకూ పంట రుణాలు మంజూరు చేసేలా చూడాలని లీడ్ బ్యాంకు అధికారులకు ఆదేశించాం.
రైతు సంక్షేమానికి గాను టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుంది. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తూ వస్తున్నది. రైతులకు పంట పెట్టుబడి సాయం మొదలుకొని పంట చేతికొచ్చే వరకు మొదలుకొని, ధాన్యం కొనుగోలు వరకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలుస్తుంది. పంటలను సాగు చేసేందుకు పెట్టుబడి సాయమందించేందుకు రైతుబంధు పథకాన్ని అమలుచేయగా, అదేవిధంగా రైతు మరణిస్తే సంబంధిత రైతు కుటుంబాన్ని ఆదుకునేందుకుగాను రూ.5 లక్షల బీమాను ప్రభుత్వం అందజేస్తుంది. రైతులకు ఆర్థికంగా మరింత చేయూతను అందించేందుకు మొదటి విడుతలో రూ.లక్ష రుణమాఫీని పూర్తి చేసిన ప్రభుత్వం, మరోసారి రూ.లక్ష రుణమాఫీలో భాగంగా ఇప్పటివరకు 70శాతం మేర రూ.లక్షలోపు పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. అయితే రెండో విడుత రుణమాఫీలో భాగంగా తొలుత రూ.25 వేలలోపు రుణాలకు సంబంధించి 10,807 మంది రైతులకు సంబంధించిన రూ.16.24 కోట్ల రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం తదనంతరం రూ.25వేల నుంచి రూ.36 వేల వరకు గల రుణాలకు సంబంధించి 21,193 మంది రైతులకు సంబంధించిన రూ.78.41 కోట్లను పంట రుణాలు ప్రభుత్వం మాఫీ చేసింది. తదనంతరం గత నెలరోజులుగా రోజుకు కొంత మేర రూ.లక్షలోపు పంట రుణాలను మాఫీ చేస్తూ వస్తుంది. అయితే జిల్లావ్యాప్తంగా రూ.లక్షలోపు పంట రుణాలు రూ.565.83 కోట్లు ఉండగా, 1,59,617 మంది రైతులు రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకున్నవారున్నారు. అయితే వీరిలో ఇప్పటివరకు 69,061 మంది రైతులకు సంబంధించిన రూ.372.57 కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. మరో పది రోజుల్లో రూ.లక్షలోపు రుణాలున్న రైతుల పంట రుణాలకు సంబంధించి మాఫీ డబ్బులను వారి బ్యాంకుల్లో జమ చేయనుంది.