వికారాబాద్ : గర్భిణులు, బాలింతలకు పోషకాహారంపై గ్రామ స్థాయిలో పోషణ్ అభియాన్ కార్యక్రమాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పిల్లల పెరుగుదలకు పోషకాహారాలను అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో పోషణ్ అభియాన్ జిల్లాస్థాయి కన్వెర్జెన్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య మాట్లాడుతూ సెప్టెంబర్ 1నుంచి 30 వరకు నిర్వహిస్తున్న పోషణ మాసంలో రక్తహీనత, పౌష్టికాహార లోపం, తల్లిపాల ప్రాముఖ్యత అనే అంశాలపై మహిళల్లో అవగాహన కల్పించాలన్నారు.
ఈ పోషణ అభియాన్ ముఖ్య ఉద్దేశం చిన్న పిల్లలు, మహిళల్లో పోషకాహార లోపాన్ని గుర్తించి పరిష్కరించాలని తెలిపారు. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, పసి పిల్లలకు పోషక విలువలతో కూడిన పౌష్టికాహారం అందించాలని సూచించారు. అంగన్వాడీ సెంటర్లు పునఃప్రారంభం అయినందునా పరిశుభ్రత, పారిశుధ్యం పై ప్రత్యేక చొరవ తీసుకోవాలని వివరించారు. పిల్లలకు స్వచ్ఛమైన భోజనాలు, తాగునీరు అందించాలన్నారు. ప్రతి అంగన్వాడీ సెంటర్కు మిషన్ భగీరథ నీటి సదుపాయం కల్పించాలని సూచించారు.
ఈ సందర్భంగా డీడబ్ల్యూవో లలితకుమారి మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో మొత్తం 1106 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని, అందులో 0-5 సంవత్సరాల 61,574 మంది పిల్లలకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. పోషక లోపం లేకుండా ప్రతి ఒక్కరిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్డీవో ఉపేందర్రెడ్డి, డీఎస్సీడీవో మల్లేశం, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ లలిత, జిల్లా అధికారులు, సీడీపీవోలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.