రంగారెడ్డి : నిరుపేద ఉపాధిహామీ కూలీల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మీయ భరోసాను నిధుల కొరత వేధిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే భూములేని నిరుపేద ఉపాధిహామీ కూలీలకు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగా జిల్లాలో 10,199 మంది కూలీలను అర్హులుగా గుర్తించింది. జిల్లావ్యాప్తంగా 1.58 లక్షల మంది కూలీలు ఉండగా అందులో పదివేల మందిని గుర్తించి మిగతా వారిని విస్మరించారు.
అర్హులుగా గుర్తించిన వారికి మొదటి విడతగా 6 కోట్ల 23 లక్షల రూపాయలను అందజేశారు. రెండో విడత గడువు దాటిపోయినప్పటికీ ఇప్పటివరకు వారికి ఆత్మీయ భరోసా నిధులు అందించడం లేదు. నిధుల కొరత ఉందని ప్రభుత్వం ఎప్పటికప్పుడు దాటవేస్తున్నది. రెండో విడతలో జిల్లాకు మరో ఆరు కోట్ల 23 లక్షలు రావాల్సి ఉంది. వెంటనే రెండో విడత ఆత్మీయ భరోసా నిధులను విడుదల చేసి తమను ఆదుకోవాలని కూలీలు కోరుతున్నారు. ఆత్మీయ భరోసా కింద ఎంపిక చేసిన ఒక్కొక్క ఉపాధి హామీ కూలీకి మొదటి విడతలో 6000 రూపాయల చొప్పున కేటాయించింది. రెండో విడతలో మరో ఆరువేల రూపాయలను ఇవ్వాల్సి ఉంది.
జిల్లావ్యాప్తంగా ఇంకా ఎంతో మంది అర్హులు ఉన్నారని, వారందరిని గుర్తించి ఆత్మీయ భరోసా కింద సహాయం అందించాలని పలువురు కూలీలు కోరుతున్నారు. జిల్లాలో 1,58,675 మంది జాబ్ కార్డులు కలిగిన వారు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,60,278 మంది కూలీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారిలో ఎంతో మంది భూములులేని నిరుపేదలు ఉన్నారు. ఆత్మీయ భరోసాకు అర్హులమైనప్పటికీ తమను ఎంపిక చేయలేదని పలువురు వాపోతున్నారు. 2023-2024 సంవత్సరంలో 20 రోజులు ఉపాధిహామీ కూలీపని చేసిన వారికి మాత్రమే ఆత్మీయ భరోసా వర్తిస్తుందని పెట్టిన నిబంధన కూలీలకు అడ్డంకిగా మారిందని అంటున్నారు. ప్రభుత్వం మరోసారి అర్హులైన వారిని గుర్తించి ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు.
మున్సిపాలిటీలలో ఉపాధిహామీ కూలీలు లేరనే సాకుతో ఆయా మున్సిపాలిటీలను ఉపాధిహామీ పథకం నుంచి మినహాయించారు. జిల్లాలో అత్యధికంగా 16 మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లు ఉన్నాయి. వాటి పరిధిలో అనేక గ్రామీణ ప్రాంతాలు కూడా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో కూలీలు ఉన్నప్పటికీ ఉపాధి హామీ పనులు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. మున్సిపాలిటీ పేరుతో ఉపాధి హామీ నిలిపివేయడమే కాకుండా ఆత్మీయ భరోసాకు కూడా నోచుకోలేకపోతున్నామని వారు వాపోతున్నారు. మున్సిపాలిటీలలో కూడా ఉపాధిహామీ పనులను చేపట్టాలని కోర్టు ప్రభుత్వానికి సూచించినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మున్సిపాలిటీలో కూడా నిరుపేద భూమిలేని కూలీలకు ఆత్మీయ భరోసా అందించాలని కోరుతున్నారు.