బీఆర్ఎస్ పార్టీలోకి ముమ్మరంగా చేరికల పర్వం కొనసాగుతున్నది. ఎన్నికలు సమీపిస్తుండడంతో రోజురోజుకూ బీఆర్ఎస్లోకి ప్రవాహంలా ఇతర పార్టీలవారు వచ్చి చేరుతున్నారు. సీఎం కేసీఆర్ వ్యూహాత్మక ఎత్తుగడలతో ప్రతిపక్షాలు కంగుతింటున్నాయి. కాంగ్రెస్, బీజేపీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీలను వీడుతున్నారు. దీంతో గులాబీ పార్టీకి బలం, బలగం పెరుగుతుండడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నెలకొంటున్నది.
బీఆర్ఎస్ అధినేత ముందుగానే అభ్యర్థులను ప్రకటించడంతో వారు వెంటనే కార్యరంగంలోకి దిగారు. మంత్రి సబితాఇంద్రారెడ్డితోపాటు ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, అంజయ్యయాదవ్, జైపాల్యాదవ్, కాలె యాదయ్యలు ఒక దఫా నియోజకవర్గాలను చుట్టి వచ్చారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలోని అంశాలకు రంగారెడ్డి జిల్లావాసులు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. కుమ్ములాటల కాంగ్రెస్, క్యాడరేలేని బీజేపీలు ఖాళీ అవుతుండడంతో పోటీ ఏకపక్షమేనని జనం చర్చించుకుంటుండడం విశేషం.
– రంగారెడ్డి, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికల జోరు ముమ్మరంగా సాగుతున్నది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వలసల పర్వం మరింతగా ఊపంకుంటున్నది. ఇది బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో జోష్ను నింపుతున్నది. ఇటీవల కొన్ని అసెంబ్లీ స్థానాలకు బీజేపీ, కాంగ్రెస్లు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ చేరికల ఊసే లేదు. బీఆర్ఎస్ అధినేత కొద్దిరోజుల క్రితం ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించగా.. చాలామంది బీఆర్ఎస్ పట్ల ఆకర్షితులవుతున్నారు. పోటీ ఏకపక్షం అని తేలుతుండడంతో కాంగ్రెస్, బీజేపీలను వీడి కారెక్కేందుకు సిద్ధమవుతున్నారు.
బీఆర్ఎస్ అధినేత ముందుగానే అభ్యర్థులను ప్రకటించడంతో వారు వెంటనే కార్యరంగంలోకి దిగారు. మంత్రి సబితాఇంద్రారెడ్డితోపాటు ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, అంజయ్యయాదవ్, జైపాల్యాదవ్, కాలె యాదయ్య ఒక దఫా నియోజకవర్గాలను చుట్టి వచ్చారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రకటించాక.. కొండంత బలంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అన్ని వర్గాల ప్రజానీకం సైతం అభ్యర్థులకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నాయి.
కాంగ్రెస్, బీజేపీల్లో అధిపత్య పోరుతో విసిగిపోతున్న ముఖ్య నేతలు.. కేసీఆర్ సర్కార్ విధానాలకు ఆకర్షితులై ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. వీరందరినీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు సాదరంగా ఆహ్వానిస్తున్నారు. పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల నుంచి కౌన్సిలర్లు ఇప్పటికే బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్, బీజేపీల్లో రాష్ట్రస్థాయి పదవుల్లో కొనసాగుతున్న ముఖ్య నేతలతోపాటు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు గులాబీ గూటికి చేరుతుండడంతో జిల్లాలో బీఆర్ఎస్ బలగం రోజురోజుకూ పెరుగుతున్నది. బీఆర్ఎస్ సర్కారు అభివృద్ధి, సంక్షేమంతోపాటు పార్టీ అధినేత కేసీఆర్ విధానాల్లో స్పష్టత, ఎన్నికలకు సమాయత్తం అవుతున్న తీరు తమను బీఆర్ఎస్లో చేరేలా ప్రేరేపిస్తున్నాయని పార్టీలో చేరిన ముఖ్య నేతలు, కార్యకర్తలు పేర్కొంటున్నారు.
రంగారెడ్డి జిల్లాలో బీజేపీకి చాలా చోట్ల క్యాడరే లేదు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమర్థవంతులైన అభ్యర్థులు కూడా కరువయ్యారు. ఇక కాంగ్రెస్లో గ్రూపు రాజకీయాలు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మరింతగా పెరుగుతున్నాయి. క్యాడర్ సైతం ఎవరికి వారే! అన్నట్లుగా వ్యవహరిస్తున్నది. ఈ పరిస్థితుల్లో ఆ రెండు పార్టీలు నేటికీ అభ్యర్థులను ప్రకటించే సాహసాన్ని చేయలేకపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కల్వకుర్తి, షాద్నగర్, చేవెళ్ల నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది.
బీజేపీ కల్వకుర్తి, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థులను ప్రకటించిన చోట్ల కూడా ఆ రెండు పార్టీల్లో జోష్ కనబడడంలేదు. చేరికల ఊసే లేదు. ఈ రెండు పార్టీల్లో నెలకొన్న పరిస్థితులు క్యాడర్ను సైతం అయోమయానికి గురిచేస్తున్నాయి. దీంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో ఉండి దండుగ.. అన్న భావనకు వచ్చి చాలామంది పార్టీలను వీడుతుండడంతో ఖాళీ అయ్యే పరిస్థితి రెండు పార్టీల్లోనూ కనిపిస్తున్నది. సీఎం కేసీఆర్ వ్యూహాత్మక ఎత్తుగడలతో ప్రతిపక్ష పార్టీలు విలవిల్లాడుతున్నాయి.