షాద్నగర్టౌన్/కులకచర్ల, మార్చి 23 : ఇప్పటికే గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే పలు పెట్రోల్ బంకుల్లో ఏర్పాటు చేసిన నోస్టాక్ బోర్డులను చూసి వాహనదారులు లబోదిబోమంటున్నారు. పట్టణంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు సోమవారం దర్శనమిచ్చాయి. పట్టణంలోని పరిగి రోడ్డులోని ఓ పెట్రోల్ బంకు వద్ద వాహనదారులు ఉదయం నుంచే బారులు తీరారు. పెట్రోల్ దొరుకుతుందో..లేదోనని కొంత మంది వాహనాల్లో పెట్రోల్ పోయించుకుంటే మరికొందరు బాటిళ్లలో తీసుకెళ్లారు. పెట్రోల్ లేకపోతే పనుల నిమిత్తం బయటికి ఎలా వెళ్లాలో అర్థం కావడం లేదని, పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే రానున్న రోజుల్లో ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు.
గ్యాస్ కోసం భారీ క్యూ..
కులకచర్ల : గ్యాస్ సిలిండర్ కష్టాలు రోజులు గడుస్తున్నా తీరడం లేదు. బుక్ చేసినా సిలిండర్లు రాకపోవడంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. భారత్ గ్యాస్ను నేరుగా గోదాము నుంచే వినియోగదారులకు పంపిణీ చేస్తుండడంతో ఉదయం నుంచే అక్కడికి భారీగా చేరుకుని నిరీక్షించారు. గ్యాస్ కొరత లేదని కేంద్రం ప్రకటిస్తున్నా గ్యాస్ నిర్వాహకులు మాత్రం గ్రామాల్లోకి సిలిండర్లను సరఫరా చేయకపోవడంతో గోదాముల వద్దకెళ్లి గంటల తరబడి క్యూలో నిరీక్షించి తెచ్చుకోవాల్సి వస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.