పదో విడుత హరితహారానికి రంగారెడ్డి జిల్లా ముస్తాబైంది. ఎప్పటిలాగే ఈ సారి కూడా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లావ్యాప్తంగా కోటికి పైగా మొక్కలు నాటాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే అటవీశాఖ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. శాఖలవారీగా లక్ష్యాన్ని నిర్దేశించగా.. త్వరలోనే మొక్కలు నాటడం ప్రారంభించనున్నారు. హరితహారంలో భాగంగా ప్రజలకు పండ్లు, పూల మొక్కలు పంపిణీ చేయనున్నారు. నాటడమే కాకుండా మొక్కల సంరక్షణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇబ్రహీంపట్నం, జూన్ 28 : రంగారెడ్డిజిల్లాలో పదోవిడుత హరితహారం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలో అడవుల శాతాన్ని గణనీయంగా పెంచాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ రంగారెడ్డిజిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని తుమ్మలూరు గ్రామంలో మొక్కలునాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. దీంతో ముఖ్యమంత్రి ఆదేశాలతో జిల్లా యంత్రాంగం గ్రామగ్రామాన మొక్కలు నాటే కార్యక్రమాన్ని సవాల్గా తీసుకుంది. పదోవిడుత హరితహారంలో నాటే మొక్కలను ఇప్పటికే అధికారులు ఆయా నర్సరీల్లో సిద్ధం చేశారు. జిల్లావ్యాప్తంగా సుమారు ఈ విడుతలో కోటి మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం అటవీశాఖ ఆధ్వర్యంలోని 18 నర్సరీలు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 558గ్రామపంచాయతీల్లో ఒక్కొక్క నర్సరీని ఏర్పాటు చేశారు.
ఈ నర్సరీల్లో కోటి మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. ఈ నర్సరీల్లో దానిమ్మ, వేప, కానుగ, నేరేడు, రావి, మర్రి, మద్ది, చింత, చీమచింత, బూరుగ, బహున్య, ఉసిరి, సీతాఫలం, రేల, ఎర్రచందనం, రోజ్హుడ్, జమ్మి, మారేడు, వెదురు, కచ్చకాయలతో పాటు వివిధ రకాల మొక్కలను పెంచారు. ఈ హరితహారంలో రోడ్లకిరువైపులతో పాటు ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటడంతో పాటు ప్రతిఇంటికీ పండ్లు, పూలమొక్కలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, మహేశ్వరం, షాద్నగర్, రాజేంద్రనగర్, తదితర నియోజకవర్గాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా జిల్లాలో అడవుల శాతం తక్కువగా ఉన్నందున ఇతర జిల్లాలకు దీటుగా రంగారెడ్డిజిల్లాలో అడవులను పెంచాలని ఆయన ఆదేశాలు జారీచేశారు.
పదో విడుత హరితహారంలో భాగంగా రంగారెడ్డిజిల్లాలో కోటి మొక్కలు నాటాలని జిల్లా యంత్రాంగం భావిస్తున్నది. ఇందుకోసం రంగారెడ్డిజిల్లాలోని 558 గ్రామపంచాయతీలకు అవసరమైన మొక్కల కోసం నర్సరీలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క నర్సరీలో పదివేల చొప్పున మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. అలాగే, అటవీశాఖ ఆధ్వర్యంలో ఉపాధిహామీ పథకం కింద జిల్లావ్యాప్తంగా 18 నర్సరీలను ఏర్పాటు చేశారు. ఈ నర్సరీల్లో సుమారు 50లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. ఈ మొక్కలన్నింటినీ అటవీప్రాంతాలతో పాటు ప్రభుత్వ ఖాళీస్థలాల్లో పెద్ద ఎత్తున నాటాలని నిర్ణయించారు. జిలా ్లపంచాయతీరాజ్శాఖ ఆధ్వర్యంలో అన్ని గ్రామ పంచాయతీలు, అటవీ శాఖ ఆధ్వర్యంలో 18నర్సరీల్లో ఉపాధిహామీ కింద 40లక్షల మొక్కలు, అటవీశాఖ ఆధ్వర్యంలో 10లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. గ్రామాల్లో ప్రతిఇంటి ఆవరణలో మొక్కలు నాటే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో హరితహారంలో భాగంగా పదో విడుతలో మొక్కలు పెద్ద ఎత్తున నాటేందుకు సర్వం సిద్ధం చేస్తున్నాం. వర్షాలు కురిసిన వెంటనే మొక్కలు నాటేందుకు ఉపాధిహామీ సిబ్బంది ఆధ్వర్యంలో గ్రామాల్లో గోతులు తీయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ చేయటంతో పాటు ఖాళీస్థలాలు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
– శ్రీనివాస్రెడ్డి, జిల్లా పంచాయతీరాజ్ అధికారి