సిటీబ్యూరో, (నమస్తే తెలంగాణ) / సుల్తాన్బజార్, డిసెంబర్ 6: తెలంగాణ రాష్ర్టానికి మూడో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. బుధవారం ఎల్బీ స్టేడియంలో సీఎస్ శాంతకుమారి, డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్రాస్, జలమండలి ఎండీ దానకిశోర్, నగర పోలీస్ కమిషనర్ సందీప్శాండిల్యా, డీఎంఈ రమేశ్రెడ్డితో పాటు ఇతర శాఖల అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా అన్ని విభాగాల అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఎటువంటి ఆటంకాలు రాకుండా చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతకుమారి తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్, ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్, యువజన నాయకులు అనిల్కుమార్ యాదవ్తో పాటు ఇతర నాయకులు ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్రెడ్డి, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ వెంకటేశ్ దోత్రె, అడిషనల్ కమిషనర్లు స్నేహ శబరీష్, యాదగిరిరావు, ఉపేందర్రెడ్డి, ఎంటమాలజీ చీఫ్ డాక్టర్ రాంబాబు, చీఫ్ వెటర్నరీ డాక్టర్ అబ్దుల్ వకీల్, సీఎం అండ్ హెచ్వో డాక్టర్ పద్మజ పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్బాబు తెలిపారు. ఈ సందర్భంగా పంజాగుట్ట, వీవీ విగ్రహం, మోనప్ప జంక్షన్, నిరంకారి, సైఫాబాద్, లక్డీకపూల్, రవీంద్రభారతి, ట్రాఫిక్ కంట్రోల్ రూం, బషీర్బాగ్, అబిడ్స్ సర్కిల్, నాంపల్లి, హిమాయత్నగర్, ఎంజేమార్కెట్, హైదర్గూడ జంక్షన్లలో రద్దీ ఉంటుందని, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు సూచించారు.