ఇబ్రహీంపట్నం, మార్చి 10 : వేసవి కాలంలో వన్యప్రాణుల దాహాన్ని తీర్చేందుకు రాష్ట్ర సర్కార్ ఆదేశాల మేరకు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లాలోని అటవీశాఖ 6 రేంజ్ల పరిధిల్లో 359 సాసర్పిట్ల నిర్మాణంతో పాటు కొత్తగా నీటి తొట్లనూ ఏర్పాటు చేశారు. అటవీ ప్రాంతాల్లోనే బోరుబావులను తవ్వించడంతో అందుబాటులోనే పుష్కలంగా తాగునీరు ఉన్నది. జంతువులు, పక్షులు పల్లెల బాట పట్టకుండా అధికారులు ఎప్పటికప్పుడు సాసర్పిట్లను నింపుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంతో అడవుల విస్తీర్ణం పెరిగింది.
అడవుల్లో తాగునీరు దొరకక గ్రామాల బాట పట్టకుండా ఉండేందుకు మూగజీవాలు, పక్షుల కోసం ప్రభుత్వ ఆదేశాల మేరకు అటవీశాఖాధికారులు వేసవిని దృష్టిలో ఉంచుకుని అటవీ ప్రాంతాల్లో ప్రత్యేక నీటి తొట్ల ఏర్పాటు కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. పలు అటవీ ప్రాంతాల్లో గత సంవత్సరం నిర్మించిన సాసర్ పిట్లతోపాటు ఈ ఏడాది నూతనంగా మరిన్ని నీటి తొట్లను ఏర్పాటు చేశారు. ఈ తొట్లల్ల్లో నీటిని నింపి వేసవిలో పక్షులు, జంతువులకు నీరందించే పనిలో అటవీశాఖాధికారులు నిమగ్నమయ్యారు. గతంలో కరువు దృష్ట్యా అటవీ ప్రాంతాల్లో తాగునీరు లభించక అనేక వణ్యప్రాణులు, పక్షులు మృత్యువాతకు గురయ్యాయి. దీంతో కోతులు, నెమళ్లు వంటి జంతువులతో పాటు, పలు పక్షులు తాగునీటి కోసం గ్రామాల బాట పట్టేవి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం పక్షులు, జంతువులకు అక్కడే తాగునీరు అందించాలనే ఉద్దేశంతో సాసర్ పిట్ల నిర్మాణం చేపట్టింది. ఈ సంవత్సరం తొట్లు, సాసర్ పిట్లు లేని అటవీ ప్రాంతాల్లో కొత్తగా మరిన్ని నిర్మాణాలు చేపట్టారు. గతంలో అటవీ ప్రాంతాల్లో ఉన్న సాసర్ పిట్లతో పాటు నూతనంగా నిర్మించిన సాసర్ పిట్లలో నీటిని నింపేందుకు పలు అటవీ ప్రాంతాల్లో బోరుబావులను కూడా తవ్వించి మూగజీవాల దాహార్తి తీర్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జంతు సంపద అధికంగా ఉన్న ఫారెస్టులను గుర్తించి.. అవసరమైన చోట ప్రత్యేక తొట్ల నిర్మాణం చేపట్టడంతో పాటు పుష్కలంగా నీరందిస్తున్నారు.
జిల్లాలో 6 అటవీ రేంజ్లు
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 6 అటవీ శాఖ రేంజ్లున్నాయి. ఈ 6 రేంజ్ల పరిధిలో 359 సాసర్ పిట్లు అందుబాటులో ఉన్నాయని.. వీటి ద్వారా మూగజీవాలు, పక్షుల వేసవి దాహార్తి తీర్చేందుకుం నీరు పుష్కలంగా అందుబాటులో ఉంచుతున్నట్లు అటవీశాఖ అధికారులు తెలుపుతున్నారు. జిల్లాలోని శంషాబాద్, ఆమనగల్లు డివిజన్ల పరిధిలోని ఇబ్రహీంపట్నం, కందుకూరు, ఆమనగల్లు, మంఖాల్, చిలుకూరు, హయత్నగర్ రేంజ్లున్నాయని.. వీటిలో ఇబ్రహీంపట్నం రేంజ్ పరిధిలో 56 సాసర్ పిట్లు, కందుకూరులో 50, ఆమనగల్లులో 65, మంఖాల్లో 75, చిలుకూరులో 65, హయత్నగర్ రేంజ్ పరిధిలో 48 సాసర్ పిట్లు ఏర్పాటు చేసినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
గ్రామాల్లో తప్పిన బెడద
గతంలో అటవీ ప్రాంతాల్లో సరైన తాగునీరు, తిండి దొరకక పక్షులు, నెమళ్లు, కోతులు, కొండెంగలు, తోడేళ్లు, అటవీ పందులు, ఎలుగుబంట్లతోపాటు ఇతర జంతువులు గ్రామాలకు వచ్చి దాహార్తి తీర్చుకునేవి. కాని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలు నేడు ఏపుగా దట్టంగా పెరిగాయి. అటవీ ప్రాంతాల్ల్లోనే ఉంటున్న మూగజీవాల కోసం ప్రభుత్వం దాహార్తి తీర్చేందుకు కూడా పుష్కలంగా తాగునీటి సాసర్ పిట్లను ఏర్పాటు చేసింది. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు అడవి జంతువుల బాధలు పోయాయి. మూగజీవాలకు తాగునీరు, తిండి పుష్కలంగా దొరుకుతుండటంతో ఎలాంటి చీకూచింత లేకుండా అటవీ ప్రాంతాల్లోనే జీవిస్తున్నాయి.
మూగజీవాల దాహార్తి తీర్చేందుకు అందుబాటులో తాగునీరు
– విష్ణువర్ధన్, అటవీశాఖ రేంజ్ అధికారి, ఇబ్రహీంపట్నం
అటవీ ప్రాంతాల్లో ఉండే మూగజీవాల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి అటవీ ప్రాంతంలో సాసర్ పిట్లు, తాగునీటి తొట్లను ఏర్పాటు చేస్తున్నాం. గతంలో తాగునీటి కోసం మూగజీవాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవి. కాని ప్రస్తుతం నీరందించేందుకు గున్గల్ అటవీ ప్రాంతంలో బోరుబావి కూడా తవ్వించాం. ఈ బోరుబావి ద్వారా చుట్టుపక్కల అటవీ ప్రాంతంలోని సాసర్ పిట్లల్లో కూడా నీటిని అందుబాటులో ఉంచుతున్నాం.