పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు రాష్ట్ర సర్కార్ చేపట్టిన ఆరోగ్యలక్ష్మి పథకం సమర్ధవంతంగా అమలవుతున్నది. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యం కోసం పౌష్టికాహారాన్ని అందిస్తున్నది. అంగన్వాడీ కేంద్రాల్లో నిత్యం పప్పు, కూరగాయలు, ఆకు కూరలతో మధ్యాహ్న భోజనాన్ని అందజేస్తున్నది. అంతేకాకుండా నిత్యం 200 మిల్లీ లీటర్ల పాలు, ఉడకబెట్టిన గుడ్డును సిబ్బంది అందిస్తున్నారు. గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం తర్వాత ఇంటికి చేరే వరకు ప్రభుత్వం సకల సౌకర్యాలను కల్పిస్తుండడంతో తల్లీబిడ్డలు క్షేమంగా ఉంటున్నారు. దీంతో మాతాశిశు మరణాల సంఖ్య తగ్గించడంలో ‘ఆరోగ్యలక్ష్మి’ అద్భుత ఫలితాన్నిస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) కింద ఏడు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా, మొత్తం 2980 కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల ద్వారా నిత్యం 1,24,004 మందికి పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఉన్నతాధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ ఆరోగ్య సమాచారాన్ని సేకరిస్తున్నారు. చిన్నారుల్లో మరుగుజ్జుతనం, శిశువు తక్కువ బరువుతో పుట్టడం, తల్లుల్లో రక్త హీనత తదితర అనారోగ్య సమస్యలు తలెత్తకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయడంతో పాటు ఆరోగ్య పరీక్షలు చేసి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
రంగారెడ్డి, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రత్యేక కార్యాచరణతో ముందడుగు వేస్తున్నది. రేపటి భవితవ్యం తల్లీబిడ్డల ఆరోగ్యంపైనే ఆధారపడి ఉన్నదని, తెలంగాణ సర్కారు కంకణం కట్టుకొని, వారి ఎదుగుదలలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడొద్దని పోషక ఆహారాన్ని, వ్యాధి నిరోధక టీకాలను అందిస్తున్నది. అందులో భాగంగా స్త్రీ, శిశు, దివ్యాంగుల సంక్షేమానికి అనేక పథకాలను అమలులోకి తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డ జన్మించి దవాఖాన నుంచి ఇంటికి చేరే వరకు ప్రభుత్వమే అండగా నిలుస్తూ అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నది. ప్రభుత్వం ఇప్పటికే కేసీఆర్ కిట్లను సమర్థవంతంగా అమలు చేస్తూ దేశవ్యాప్తంగా మన్ననలు అందుకుంటున్న విషయం తెలిసిందే. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపం ఉండొద్దని సీఎం కేసీఆర్ ఆరోగ్యలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టారు. వ్యాధి నిరోధక టీకాలు, ఆరోగ్య పరీక్షలు, రిఫరల్ సేవలను అందిస్తున్నది.
నిత్యం 1,24,004 మందికి పౌష్టికాహారం
రంగారెడ్డి జిల్లాలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) కింద ఏడు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా మొత్తం 2980 కేంద్రాలు నడుస్తున్నాయి. నిత్యం 1,24,004 మందికి పౌష్టికాహారం అందిస్తున్నారు. ఇందులో 15,404 మంది గర్భిణులు, 13,412 మంది బాలింతలు, ఏడు నెలల నుంచి మూడేండ్ల లోపు చిన్నారులు 69,372 మంది, ఇంకా మూడేండ్ల నుంచి ఆరేండ్ల లోపు చిన్నారులు 25,816 మంది ఉన్నారు.
పోషక ఫలితాలను మెరుగుపర్చడానికి..
పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లుల్లో పోషక ఫలితాలను మెరుగుపర్చడానికి పోషణ్ అభియాన్ ఒక ప్రధాన కార్యక్రమం. 2018 నుంచి ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా, లక్ష్యంగా ఉన్న విధానం, కన్వర్జెన్స్, స్టంటింగ్ స్థాయిని, తక్కువ పోషకాహారాన్ని, రక్త హీనత, పిల్లల్లో తక్కువ బరువు, జనన బరువు తగ్గించడానికి ఈ కార్యక్రమం ప్రయత్నిస్తున్నది. ఇది కౌమార దశలో ఉన్న బాలికలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులపై కూడా దృష్టి సారిస్తున్నది. దీని ద్వారా పోషకాహార లోపాన్ని సంపూర్ణంగా పరిష్కరిస్తున్నది. ఇంకా ఆరేండ్ల లోపు పిల్లల్లో వయసు తగిన ఎత్తు పెరిగేలా చూసి మరుగుజ్జుతనాన్ని నివారించడం, ఎత్తుకు తగిన బరువు ఉండేలా, రక్త హీనత తగ్గింపునకు కృషి చేస్తున్నారు. 15 ఏండ్ల నుంచి 49 ఏండ్ల వయసు గల మహిళలు, యువతుల్లో రక్త హీనత తగ్గించడం, చిన్నారులు తక్కువ బరువుతో పుట్టడాన్ని తగ్గించడమే లక్ష్యంగా ‘పోషణ్ అభియాన్’ అమలవుతున్నది. అంగన్వాడీ టీచర్లు తమ వద్ద ఉన్న స్మార్ట్ఫోన్ల ద్వారా డేటాను ఆన్లైన్లో ఫీడ్ చేస్తున్నారు. ఇండికేటర్స్ను ఏర్పర్చుకొని ప్రతి శుక్రవారం అంగన్వాడీ కేంద్రాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.
పోషక ఆహారం ఇలా..
రాష్ట్రంలోని ప్రతి అంగన్వాడీ కేంద్రంలో నిత్యం పప్పు, కూరగాయలు, ఆకు కూరలతో మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. దీంతోపాటు రోజుకు 200 మిల్లీ లీటర్ల వేడి పాలు, ఉడకబెట్టిన గుడ్డును పోషక ఆహారంగా అందిస్తున్నారు. ఏడు నెలల నుంచి మూడేండ్ల చిన్నారులకు రోజూ ఉడకబెట్టిన గుడ్డుతో పాటు నెలలో 16 గుడ్లను చిన్నారుల ఎదుగుదల నిమిత్తం ఇంటికి పంపిస్తున్నారు. మూడేండ్ల నుంచి ఆరేండ్ల పిల్లలకు అంగన్వాడీ కేంద్రంలో రోజూ ఉడకబెట్టిన గుడ్డుతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నారు. ‘ఆరోగ్యలక్ష్మి’తో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పౌష్టికాహార లోపం, రక్త హీనత, శరీర బలహీనత లేకుండా దోహదపడుతున్నది. గ్రామ పెద్దలు, తల్లిదండ్రులతో కమిటీలు ఏర్పాటు చేసి పోషకాహారం అందేలా చర్యలు తీసుకుంటున్నారు.
నిత్యం పౌష్టికాహారం పంపిణీ
క్రమం తప్పకుండా.. ప్రతి రోజూ అన్ని కేంద్రాల్లో డేటాను పరిశీలిస్తాను. ఆరోగ్యలక్ష్మి పథకంలో భాగంగా నిత్యం పౌష్టికాహారాన్ని ప్రభుత్వం ద్వారా అందిస్తున్నాం. సరైన పోషక విలువలతో కూడిన సమతుల్య ఆహారం అందించడంతో పాటు తగు జాగ్రత్తలు సూచిస్తున్నాం. ఆకుకూరలతో పాటు పప్పు, పాలు, గ్రుడ్డును అందిస్తున్నాం. వ్యాధి నిరోధక టీకాలు, ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. డీసీజీ టీకాను 1751 చిన్నారులకు, డీపీటీ ఫస్ట్ డోస్లో భాగంగా 1700 మందికి, రెండో డోస్లో 1829 మందికి, మూడో డోస్లో భాగంగా 1675 మంది చిన్నారులకు వ్యాక్సిన్స్ వేస్తున్నాం. మొత్తంగా 5,204 మందికి వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నాం. మా శాఖ నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాం.
– మోతి, రంగారెడ్డి జిల్లా స్త్రీ, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి