వికారాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ) : పోడు రైతులకు మంచిరోజులొచ్చాయి. ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్నా పట్టాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. రైతన్నల బాధను అర్థం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం అర్హులైనవారికి పట్టాలివ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించి క్షేత్రస్థాయిలో సర్వే చేసిన వికారాబాద్ జిల్లా యంత్రాంగం అర్హుల తుది జాబితాను సిద్ధం చేసింది. ప్రభుత్వం ఆదేశాలివ్వగానే పట్టాలిచ్చేలా కసరత్తు చేస్తున్నది. పాసు పుస్తకాల ప్రింటింగ్ ప్రక్రియ పూర్తి కాగా, ఈ నెలాఖరులోగా పట్టాల పంపిణీకి తేదీని ఖరారు చేసే అవకాశమున్నది. జిల్లాలోని 114 గ్రామపంచాయతీల్లోని పోడు భూములను గిరిజన, గిరిజనేతర రైతులు సాగు చేసుకుంటుండగా, 438 మందిని ప్రభుత్వం అర్హులుగా గుర్తించింది. అత్యధికంగా కులకచర్ల మండలంలో 186 మంది ఉండగా, పరిగి మండలంలో 77 మంది, ధారూరు మండలంలో 54 మంది, చౌడాపూర్ మండలంలో 33 మంది, యాలాల మండలంలో 30 మంది, దోమ మండలంలో 28 మంది, పెద్దేముల్ మండలంలో 11, బషీరాబాద్లో ఏడుగురు, కొడంగల్ మండలంలో ఆరుగురు, పూడూరు మండలంలో ఆరుగురు అర్హులు ఉన్నారు.
జిల్లాలో పోడు భూములు సాగు చేసుకుంటున్న అర్హులైన రైతుల తుది జాబితా సిద్ధమైంది. అర్హులైన పోడుదారులకు త్వరలోనే పట్టాలిచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే పోడు భూముల పట్టాలను పంపిణీ చేసేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అర్హులైన పట్టాదారులకు పోడు పట్టాలను పంపిణీ చేసేందుకు పాసు పుస్తకాల ప్రింటింగ్ ప్రక్రియను పూర్తి చేసి సిద్ధంగా ఉంచారు. ఈ నెలాఖరులో పోడు భూములను సాగు చేసుకుంటున్న అసలైన పోడు రైతులకు పట్టాలను పంపిణీ చేసే తేదీని ప్రభుత్వం ఖరారు చేసే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. వచ్చే నెలలో జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు పట్టాల పంపిణీ చేయనున్నారు.
మార్చిలోనే పోడు భూముల సర్వే ప్రక్రియ పూర్తి
పోడు భూముల సర్వే ప్రక్రియను మార్చిలో జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. పోడు భూముల సర్వేలో భాగంగా పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించడంతోపాటు ఎప్పటి నుంచి సాగు చేసుకుంటున్నారు, గిరిజనులా, గిరిజనేతరులా, ఎన్ని ఎకరాల్లో సాగు చేసుకుంటారనే వివరాలను సేకరించారు.
జిల్లాలోని 114 గ్రామపంచాయతీలు 22,485 ఎకరాల్లో పోడు భూములను 9973 మంది గిరిజన, గిరిజనేతర రైతులు సాగు చేసుకుంటున్నారని గుర్తించిన అధికారులు 438 మంది అసలైన పోడుదారులుగా జిల్లా యంత్రాంగం గుర్తించింది. జిల్లాలో అత్యధికంగా కులకచర్ల, పరిగి, ధారూరు, యాలాల, చౌడాపూర్ మండలాల్లో పోడు భూములు ఎక్కువగా ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. మరోవైపు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 2005కు ముందు అటవీ భూములను ఆక్రమించి సాగు చేసుకుంటున్న గిరిజనులతోపాటు మూడు తరాలుగా అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజనేతరులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ
అర్హులైన వారందరికీ త్వరలోనే పోడు పట్టాలను పంపిణీ చేయనున్నారు. పోడు రైతుల ఎంపిక ప్రక్రియను జిల్లా యంత్రాంగం పూర్తి పారదర్శకంగా నిర్వహించింది. మొదట పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. దరఖాస్తులవారీగా క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు సర్వే ప్రక్రియను నిర్వహించారు. అనంతరం నిజమైన పోడుదారులను ఎంపిక చేసేందుకు గ్రామసభలను కూడా నిర్వహించారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులకు అనుగుణంగా గ్రామసభల్లో పరిశీలించి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 2005కు ముందు నుంచి సాగు చేసుకుంటున్నారా లేదనే పూర్తి వివరాలను గ్రామసభల్లో చర్చించి నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి గ్రామసభల్లోనే తీర్మానం చేశారు.
అర్హులైన పోడు రైతులు 438 మంది
జిల్లాలో పోడు భూములను సాగు చేసుకుంటున్న అర్హులైన రైతుల తుది జాబితాను జిల్లా యంత్రాంగం ఇప్పటికే ప్రభుత్వానికి అందజేసింది. జిల్లావ్యాప్తంగా గిరిజన, గిరిజనేతరులు కలిపి మొత్తం 9973 మంది పోడు భూములను సాగు చేసుకుంటున్నట్లుగా పట్టాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోగా, వీరిలో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 438 మంది అర్హులుగా జిల్లా యంత్రాంగం తేల్చింది. అత్యధికంగా కులకచర్ల మండలంలో, అత్యల్పంగా కొడంగల్ మండలంలో ఉన్నట్లు జిల్లా యంత్రాంగం గుర్తించింది.
ఆన్లైన్లో పొందుపర్చిన వివరాలు
పోడు భూముల సర్వే అనంతరం సంబంధిత వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో నేరుగా ఆన్లైన్లో పొందుపర్చారు. పోడు భూముల సర్వేతోపాటు లబ్ధిదారుల ఎంపికకు గ్రామస్థాయి కమిటీలో పంచాయతీ కార్యదర్శి, అటవీ శాఖ బీట్ అధికారి, సర్వేయర్, తహసీల్దార్, డివిజన్ స్థాయి కమిటీలో చైర్మన్గా ఆర్డీవో, సభ్యులుగా డీఎఫ్వో, డీజీటీవో, ఇద్దరు గిరిజన జడ్పీటీసీలు ఉండగా, జిల్లా స్థాయి కమిటీకి చైర్మన్గా జిల్లా కలెక్టర్ వ్యవహరించగా, సభ్యులుగా జిల్లా అటవీ శాఖ అధికారి, జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఉన్నారు. గ్రామ స్థాయిలో తీర్మానం అనంతరం డివిజన్ స్థాయిలో తీర్మానం చేసి, అనంతరం జిల్లా స్థాయి కమిటీ అర్హుల జాబితా పరిశీలించి తుది జాబితాకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ ఆమోదం తెలిపి, సంబంధిత పోడుదారుల జాబితాను ప్రభుత్వానికి అందజేశారు.