సిటీబ్యూరో, జూన్ 30 (నమస్తే తెలంగాణ): మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగు రోడ్డుపై కొత్తగా మరో ఇంటర్చేంజ్ అందుబాటులోకి రానున్నది. శనివారం నార్సింగి ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. గ్రేటర్ చుట్టూ 158 కి.మీ మేర ఉన్న ఔటర్ రింగు రోడ్డుపై ఇప్పటి వరకు 19 ఇంటర్చేంజ్లు ఉండగా, కొత్తగా మరో మూడింటిని నార్సింగి, కోకాపేట నియోపొలీస్, మల్లంపేట ప్రాంతాల్లో నిర్మిస్తున్నారు. ఇందులో మొదట నార్సింగి ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్కు సంబంధించిన పనులన్నీ పూర్తి కావడంతో ట్రాఫిక్ను అనుమతించనున్నామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. అదే విధంగా కోకాపేట నియోపొలీస్ లే అవుట్ వద్ద నిర్మిస్తున్న ట్రంపెట్ పనులు పురోగతిలో ఉన్నాయని, ఈ ఏడాదిలోనే దాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని, దీంతో ఐటీ కారిడార్లో ఓఆర్ఆర్పైకి వెళ్లాలన్నా, కింద రావాలన్నా అత్యంత అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఐటీ కారిడార్లో గచ్చిబౌలి, నానక్రాంగూడ, కోకాపేట నుంచి ఓఆర్ఆర్ పైకి వెళ్లేందుకు, కిందకు దిగేందుకు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. శనివారం నుంచి నార్సింగి, ఆ తర్వాత కోకాపేట ట్రంపెట్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
గ్రేటర్ చుట్టూ నిర్మించిన ఔటర్ రింగు రోడ్డు వరకు కోర్ సిటీ నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే రోడ్లను రేడియల్ రోడ్లుగా గుర్తించి ఎంతో విశాలంగా సిగ్నల్ అవసరమే లేకుండా ఇంటర్చేంజ్లను నిర్మించారు. ఇలా మొత్తం ఓఆర్ఆర్ మీద 19 చోట్ల నిర్మించగా, నార్సింగి వద్ద మాత్రం కేవలం ఓఆర్ఆర్ మార్గం కింద నుంచి వెళ్లగా శంకర్పల్లి వైపు వెళ్లే మార్గాన్ని ఫ్లై ఓవర్ నిర్మించారు. ఇంటర్చేంజ్ను నిర్మించాల్సిన చోట కేవలం ఫ్లై ఓవర్ నిర్మించడంతో ఇప్పుడు ఇక్కడ నెలకొన్న సమస్య కోసం కొత్తగా ఇంటర్చేంజ్ నిర్మాణానికి చేపట్టినా ఎన్నో ఇబ్బందులు తలెత్తాయి. గండిపేట నుంచి వచ్చే మూసీ నదికి తోడు మెహిదీపట్నం నుంచి శంకర్పల్లి వెళ్లే మార్గంలో భూసేకరణ చేయలేదు. దీంతో కొంత కాలంగా నార్సింగి ఇంటర్ చేంజ్ పనులకు సాంకేతికంగా అడ్డంకులు ఎదురైనా,వాటిని పరిష్కరించి నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇందుకోసం మొత్తం రూ.29.50 కోట్లతో నార్సింగి ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ పనులను పూర్తి చేశామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.
ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున నగరంలో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా పడమర దిక్కున ఉన్న ఐటీ కారిడార్ ప్రాంతం శరవేగంగా విస్తరిస్తున్నది. ఐటీ కారిడార్ నుంచి శంషాబాద్ విమానాశ్రయంతో పాటు బెంగళూరు, శ్రీశైలం, నాగార్జునసాగర్, విజయవాడ వంటి జాతీయ రహదారుల వైపు వెళ్లేందుకు ఔటర్ రింగు రోడ్డు అందుబాటులో ఉంది. ఓఆర్ఆర్పై ఉండే ట్రాఫిక్ మొత్తంలో సింహ భాగం ఐటీ కారిడార్ నుంచే ఉంటున్నది. ప్రధానంగా జూబ్లీహిల్స్, మాదాపూర్తో పాటు మియాపూర్, కూకట్పల్లి ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలతో పాటు నానక్రాంగూడ, పుప్పాల్గూడ, కోకాపేట, మణికొండ, నార్సింగి ప్రాంతాల నుంచి ఔటర్ పై రాకపోకలు సాగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సమస్య పరిష్కారం కోసం నార్సింగి ప్రాంతంలో కొత్తగా వాహనాలు ఔటర్పైకి ఎక్కేందుకు, దిగేందుకు ర్యాంపులను ఏర్పాటు చేశారు. నార్సింగి జంక్షన్ ఇంటర్చేంజ్ అందుబాటులోకి వస్తే శంషాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాల రద్దీ నానక్రాంగూడ ఓఆర్ఆర్ టోల్ప్లాజా దగ్గర రద్దీ తగ్గుతుంది. ఐటీ కంపెనీల కార్యాలయాలతో పాటు నివాస ప్రాంతాలు ఎక్కువగా నార్సింగి, కోకాపేట, పుప్పాల్గూడ, మంచిరేవుల ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్టుమెంట్లు, విల్లాలు, ఇతర నివాసాలు పెరుగుతుండడంతో నార్సింగి ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ కీలకంగా మారనున్నది. భవిష్యత్లోనూ ఈ ప్రాంతంలో మరిన్ని నివాసాలు వచ్చేందుకు అవకాశం ఉండడంతో ట్రాఫిక్ గణనీయంగా పెరగనున్నది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న హెచ్ఎండీఏ నార్సింగ్ ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ను నిర్మించింది.