కేంద్రం గ్యాస్ ధరలు పెంచడంపై నిరసనలు కొనసాగుతున్నాయి. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన ర్యాలీలతో పల్లెలు, పట్టణాలు హోరెత్తాయి. ఆందోళనలతో రోడ్లన్నీ గులాబీమయంగా మారాయి. మహిళలు అధిక సంఖ్యలో హాజరై రోడ్లపై కట్టెల పొయ్యిలపై వంటలు చేసి, మోదీ దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో గ్రామాలు, పట్టణాలు మార్మోగాయి. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేటలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొని కేంద్రం తీరుపై మండిపడ్డారు. ప్రధానికి ధరలు బాదడం తప్ప బాధ్యతలు తెలియవని ధ్వజమెత్తారు. ఆడబిడ్డల ఉసురుపోసుకుంటున్న మోదీ సర్కార్కు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
-రంగారెడ్డి, మార్చి 3 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, మార్చి 3(నమస్తే తెలంగాణ): బండ బాదుడుపై జనం భగ్గుమన్నది. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచడంపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. శుక్రవారం రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో మహిళలు, ప్రజలు యువత, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఖాళీ సిలిండర్లు, ప్లకార్డులు పట్టుకొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వ తీరుపై పలుచోట్ల ఆగ్రహం వ్యక్తం చేసి కేంద్ర ప్రభుత్వం, మోదీ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
చౌరస్తాల్లో కట్టెల పొయ్యిలపై వంటలు చేసి నిరసన తెలిపారు. ‘మోదీ డౌన్ డౌన్.. అచ్చేదిన్ కాదు సచ్చేదిన్’ అంటూ నినాదాలతో హో రెత్తించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సం స్థలకు కొమ్ముకాస్తున్నదని మండిపడ్డారు. వెంటనే పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. 2020 నుంచి ఇప్పటివరకు 12 సార్లు గ్యాస్ ధరలను పెంచిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కిందని ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో చేపట్టిన నిరసన, రాస్తారోకో కార్యక్రమాలు మి న్నంటాయి. ఇందులో మహిళలు, యువత, స్థానికులు వేలాదిగా పాల్గొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సిలిండర్లు పక్కకు పెట్టి కట్టెల పొయ్యిపై వం టావార్పు చేశారు. చేవెళ్ల నియోజకవర్గంలోని ఐదు మం డలాల్లో నిరసనలు భారీ స్థాయిలో జరిగాయి. బీజాపూర్ – హైదరాబాద్ రహదారిపై చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొని ‘బీజేపీని గద్దె దించాలి’ అంటూ నినదించారు. షాద్నగర్లో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పా ల్గొని ‘మోదీ సర్కార్ డౌన్డౌన్’ అంటూ నినాదాలు చేశా రు. కేశంపేట, కడ్తాల్, నందిగామ మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ నేతలు కట్టెల పొయ్యి పెట్టి ‘ఇక ఇదే గతి’ మనకు అంటూ స్థానిక మహిళలతో కలిసి ధర్నా చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో మంత్రి సబితారెడ్డి పాల్గొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆమనగల్లులో జరిగిన నిరసనలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్ గంటపాటు రోడ్డుపై బైఠాయించి మహిళలతో కలిసి కట్టెలతో వంటావార్పు చేసి నిరసన తెలిపారు. అదేవిధంగా వికారాబాద్ నియోజకవర్గంలోని వికారాబాద్ పట్టణం, ధారూర్ మండల కేంద్రాల్లో వంట గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పాల్గొని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. తాండూరు నియోజకవర్గంలోని తాండూరు పట్టణంతోపాటు పెద్దేముల్ మండల కేంద్రం లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి పాల్గొన్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్ పట్టణంతోపాటు బొంరాస్పేట మండల కేంద్రంలో జరిగిన నిరసనలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడు తూ కార్పొరేట్ సంస్థలకు వత్తాసు పలుకుతూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో ప్రజలే సరైన బుద్ధి చెబుతారన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిత్యావసర ధరలతోపాటు గ్యాస్ ధరలను భారీగా పెంచుతూ పేదల నడ్డి విరుస్తున్నదన్నారు.