బతుకుదెరువు కోసం తెలంగాణకు వలస వచ్చినవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయి. రాష్ట్ర సర్కార్ వారికి అండగా నిలుస్తూ కొండంత ధైర్యాన్నిస్తున్నది. 1942లో గుంటూరు జిల్లా ఫిరంగిపూర్ గ్రామానికి చెందిన మూడు కుటుంబాలు వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి వలస వచ్చాయి. నేడు 40 కుటుంబాలకు చేరి మరియాపూర్ గ్రామంగా ఏర్పాటు కావడం విశేషం. వీరికి ప్రభుత్వం నుంచి మిషన్ భగీరథ తాగునీటితో పాటు రైతుబంధు, రైతుబీమా, నిరంతర కరెంట్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్తో పాటు పథకాలన్నీ అందుతున్నాయని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పాలన దేశానికే రోల్ మోడల్ అని ప్రశంసిస్తున్నారు. ఉద్యమంలో మద్దతు తెలిపామని, రాష్ట్రం ఏర్పాటయ్యాక బతుకులు బాగుపడ్డాయని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వికారాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ) : ఆ గ్రామస్తులంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లావాసులు. తొలుత నల్లగొండ జిల్లాలోని మటంపల్లికి వలసవెళ్లినవారు, తదనంతరం వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి వలసవచ్చారు. దేశానికి స్వాతంత్య్రం రాకముందు 1942లో మూడు కుటుంబాలుగా వచ్చిన గుంటూరు జిల్లా ఫిరంగిపూర్ గ్రామస్తులు నేడు మరియాపూర్ గ్రామంగా ఏర్పాటై 40 కుటుంబాలకు చేరింది. నాడు గుడిసెలు వేసుకొని జీవనం గడిపిన మరియాపూర్ గ్రామస్తులు నేడు పక్కా ఇండ్లు కట్టుకొని సెటిలయ్యారు. మొదట కొర్రలు, సజ్జలు, జొన్నలు, సామలు పండించేవారు.. నేడు పత్తి, మొక్కజొన్న, మిరప, పసుపులాంటి పంటలను పండిస్తూ కొత్త ఒరవడికి నాంది పలికారు. 80 ఏండ్ల నుంచి మూడు తరాలుగా జీవనం సాగిస్తున్న మరియాపూర్ గ్రామస్తులు ఆర్థికంగా వృద్ధి చెందారు.
సంక్షేమ పథకాల అమలులో సీఎం కేసీఆర్ ఆదర్శం
తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు కూడా తెలిపి ప్రత్యేక తెలంగాణ రాష్ర్టానికి చెయ్యెత్తి జైకొట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో కొందరు సృష్టించిన అపోహలతో భయపడి పోయుంటే సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు దూరమయ్యేవారమని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మారుమూల పల్లెలకు రోడ్లు, తాగునీరు, 24 గంటల కరెంటు, అండర్ డ్రైనేజీ, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు అందుబాటులోకి వచ్చాయన్నారు. సబ్బండవర్గాల ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే రోల్ మోడల్గా నిలిచాయన్నారు. రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళిత బంధు తదితర పథకాల లబ్ధి పొందుతున్నామని హర్షం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రాజకీయాల్లోనూ సీఎం కేసీఆర్ రాణిస్తారని, దేశమంతటా తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలన్నీ అమలు చేయాలంటే సీఎం కేసీఆర్తోనే సాధ్యమని మరియాపూర్ గ్రామ ప్రజలు చెబుతున్నారు. మాది గుంటూరు జిల్లాలోని ఫలానా ఊరు అని మాత్రమే తెలుసు.. కానీ అక్కడికి ఎప్పుడూ వెళ్లింది లేదని పేర్కొన్నారు. ఇక్కడే సంతోషంగా జీవనం గడుపుతున్నామని.. చావైనా.. బతుకైనా ఇక్కడే ఉంటామని వారు స్పష్టం చేస్తున్నారు.
ప్రభుత్వ పథకాలన్నీ అందుతున్నయి
– మల్రెడ్డి, మరియాపూర్
బీఆర్ఎస్ సర్కారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయి. రైతుబంధు, రైతు బీమా లబ్ధి పొందుతున్నాం. వ్యవసాయ సాగుకు నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నారు. వరి పంటకు ప్రభుత్వమే మద్దతు ధర నిర్ణయించి కొనుగోలు చేస్తున్నది. గత ప్రభుత్వాలు రైతుల సంక్షేమంపై పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. పక్క రాష్ర్టాల్లో లేని సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చింది.
మిషన్ భగీరథతో తాగునీటి సమస్య తీరింది
– బాల్రెడ్డి, మరియాపూర్
వేసవికాలం వచ్చిందంటే గతంలో తీవ్ర నీటి ఎద్దడితో గ్రామంలో ఇబ్బందులు ఎదుర్కునేవాళ్లం. గ్రామంలో మూడు బోరుబావులు ఉన్నా వాటిలో నీరు లేక అందరం నీటి కష్టాలతోపాటు సమయానికి పొలం పనులకు వెళ్లేవాళ్లం కాదు. మండలానికి మా గ్రామం మారుమూలన ఉండడంతో పెద్దగా ఎవరూ పట్టించుకునేవారు కాదు. మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లాల ద్వారా నీటి సరఫరా జరుగుతున్నది.
మా పూర్వీకులు ఆంధ్రా నుంచి వచ్చి స్థిరపడ్డారు
– బాలశివారెడ్డి, మరియాపూర్
మా తాతలు ఆంధ్రప్రదేశ్ గుంటూరు నుంచి ఈ ప్రాంతానికి వలస వచ్చారు. 1942లో మూడు కుటుంబాలవారు వచ్చి గుడిసెలు వేసుకొని ఉండేవారు. ఆంధ్రాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ భూములు కొనుగోలుచేసి వ్యవసాయం చేస్తూ ఇక్కడే స్థిరపడ్డారు. గ్రామంలో 40కి పైగా కుటుంబాలున్నాయి. వ్యవసాయం చేసుకుంటూ పిల్లలను హైదరాబాద్లో చదివిస్తున్నాం.