షాబాద్, డిసెంబర్ 4: అంబేద్కర్ రచించిన రాజ్యాంగం, హక్కులతోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని, అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నదని ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం షాబాద్ మండలంలోని హైతాబాద్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కె.ఎస్ రత్నం, జడ్పీటీసీ పట్నం అవినాశ్రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించేలా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారన్నారు.
అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని, దళితుల ఆర్థికాభివృద్ధి కోసం దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టిన్నట్లు వివరించారు. అంబేద్కర్ ఆశయసాధన, ఆలోచనా విధానాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం సమాజంలోని అణగారిన వర్గాల మేలు కోసం నిరంతరం కృషి చేస్తున్నదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే మహనీయుల జాబితాలో ముందుండే గొప్ప నేత అంబేద్కర్ అని చెప్పారు.
అనంతరం కళాకారులచే ఆటపాటల కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో మండల కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ చాంద్పాషా, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింగ్రావు, పీఏసీఎస్ చైర్మన్ చల్లా శేఖర్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కొలన్ ప్రభాకర్రెడ్డి, మాజీ సర్పంచ్ పి. దర్శన్, ప్రొఫెసర్ ఖాసీం, జె.పి రాజు, రెంజర్ల రాజేశ్, ఏడీఏ రాజారత్నం, నాయకులు కరుణాకర్, సత్తయ్య, గోపాల్, శేఖర్, రాఘవేందర్, రాజుగౌడ్, హరిప్రసాద్, నర్సింహులు, లక్ష్మయ్య, సిద్దేశ్వర్, మధుసూదన్రెడ్డి, చంద్రశేఖర్, ఖాజామియా, రశీద్, జహీంగీర్, యువజన సంఘాల సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.