ధరణి పోర్టల్తో ఏండ్ల భూ సమస్యలకు పరిష్కారం లభిస్తున్నది. ఈసీలతోపాటు భూమికి సంబంధించిన ఇతర సర్టిఫికెట్లన్నీ ఈ పోర్టల్ నుంచి పొందే అవకాశం ఉండడంతో రైతులకు ఇబ్బందులు తీరుతున్నాయి. పాసు పుస్తకాల్లో తప్పుగా ముద్రించిన పట్టాదారు పేర్లు, భూ విస్తీర్ణం వంటి వాటిని కూడా ధరణి ద్వారా దరఖాస్తు చేసుకొని సవరించుకునే వీలున్నది. ఒక వ్యక్తికి ఎన్ని సర్వే నంబర్లలో భూమి ఉన్నా.. ఒకే ఖాతాను రూపొందించి ఒకే పాసు పుస్తకాన్ని జారీ చేస్తున్నారు. గతంలో ఉత్పన్నమైన ఆర్ఎస్ఆర్(రీ-సెటిల్మెంట్ రికార్డు) సమస్యలను ధరణితో పూర్తిగా పరిష్కరించారు. ఇన్ని సౌలత్లు ఉన్న ధరణి పోర్టల్పై ప్రతిపక్షాలు రాద్దాంతం చేయడంపై ప్రజలు మండి పడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ను రద్దు చేస్తామని ప్రకటించడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సాఫీగా సేవలందుతున్న ధరణిని రద్దు చేస్తే మళ్లీ గందరగోళ పరిస్థితులు ఏర్పడి, అన్నదాతలు ఆగమవుతారని జనం మండిపడుతున్నారు.
-వికారాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, మే 31, (నమస్తే తెలంగాణ): పారదర్శక సేవలందుతున్న ధరణి పోర్టల్పై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ను రద్దు చేస్తామని చేస్తున్న ప్రకటనలపై జిల్లా యంత్రాంగం అసహనం వ్యక్తం చేస్తున్నది. పోర్టల్ను రద్దు చేసినట్లయితే మళ్లీ గందరగోళ పరిస్థితులు ఏర్పడి, రిజిస్ట్రేషన్ మొదలుకొని మ్యుటేషన్, సక్సేషన్ తదితర ప్రక్రియల కోసం రైతులు నెలల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడే ఆస్కారం ఉంది. ఈసీలతోపాటు ఇతర సర్టిఫైడ్ సర్టిఫికెట్లన్నీ కూడా ధరణి ద్వారా నేరుగా పొందుతున్నారు. అదేవిధంగా పాసు పుస్తకాల్లో తప్పుగా ముద్రించిన సంబంధిత పట్టాదారు పేర్లు, విస్తీర్ణంలోని తప్పులను కూడా సవరించడం జరుగుతుంది. గతంలో ఒక్కో వ్యక్తికి రెండు, మూడు ఖాతాలతోపాటు పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేసేవారు, ధరణి అందుబాటులోకి వచ్చిన తరువాత ఒక వ్యక్తికి ఒక ఖాతాను మాత్రమే రూపొందించి ఎన్ని చోట్ల భూమి ఉన్నా..
ఒకే పాసు పుస్తకాన్ని జారీ చేస్తున్నారు. ధరణితో డబుల్ రిజిస్ట్రేషన్లకు ఆస్కారం ఉండదు, ఒకరి ఆస్తిని మరొకరు విక్రయించేందుకు వీలుండదు. ధరణి అందుబాటులోకి రాకముందు మ్యుటేషన్తోపాటు తదితరాలకు సంబంధించి మీ సేవలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది, సంబంధిత భూపత్రాలను కూడా జతపర్చి మీ సేవలో అందజేసేవారు. మీసేవా నిర్వహకులు జతపర్చిన పత్రాలన్నింటినీ ఇవ్వకపోవడం, వీఆర్వోలు డబ్బులు ఆశించడం తదితర కారణాలతో తహసీల్దార్ల వద్దనే ఏండ్ల తరబడి సమస్యలు పెండింగ్లో ఉంటూ వస్తుండేది. ధరణి అందుబాటులోకి వచ్చినట్లయితే తహసీల్దార్ల వద్దనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరుగుతుండగా, ఆన్లైన్లో ఏ అధికారి వద్ద పెండింగ్లో ఉందో తెలిసిపోతుంది.
ధరణితో ఆర్ఎస్ఆర్ పరిష్కారం…
ధరణి పోర్టల్తో ఆర్ఎస్ఆర్(రీ-సెటిల్మెంట్ రికార్డు) సమస్యలను పూర్తిగా పరిష్కరించారు. భూములను విక్రయించినప్పటికీ వారి పేరిటనే ఉండడంతోపాటు అదే భూమిని కొత్త వారి పేరిట వివరాలను ఆన్లైన్లో పొందుపర్చడం, బోగస్ పాసు పుస్తకాలు సృష్టించడం, కంప్యూటర్ ఆపరేటర్లు చేసిన తప్పులతో ఆర్ఎస్ఆర్ సమస్యలొచ్చాయి. దీంతోపాటు పలు మండలాల్లోని కంప్యూటర్ ఆపరేటర్లు, వీఆర్వోలు కుమ్మక్కై చేసిన తప్పులతో కూడా తక్కువ విస్తీర్ణం ఉన్నప్పటికీ సదరు సర్వే నంబర్లో ఎక్కువ విస్తీర్ణం ఉన్నట్లు జారీ చేశారు. ఉదాహరణకు జిల్లాలోని పూడూర్ మండలం ఎన్కెపల్లి గ్రామ పంచాయతీలోని సర్వే నంబర్ 99లో వాస్తవానికి 8 ఎకరాల భూమి ఉంది, ఈ సర్వే నంబర్లో 170 ఎకరాలున్నట్లు రెవెన్యూ యంత్రాంగం పట్టాలు జారీ చేసింది.
162 ఎకరాల భూమి ఎక్కువగా ఉన్నట్లు పట్టాలు జారీ చేయడం గమనార్హం. అదే గ్రామ పంచాయతీలో సర్వే నెంబర్ 100లో 2.23 ఎకరాల భూమి ఉండగా, 14 ఎకరాల భూమి ఉన్నట్లు పట్టాలు జారీ చేశారు. సుమారు 12 ఎకరాల భూమిని ఎక్కువగా చూపిస్తూ పట్టాలిచ్చారు. చాలా వరకు ఆయా మండలాల్లో కంప్యూటర్ ఆపరేటర్లు ఆన్లైన్లో పొందుపర్చే సమయంలో చేసిన తప్పులతోనే తక్కువ విస్తీర్ణంగల భూమి ఎక్కువ విస్తీర్ణం ఉన్నట్లు పట్టాలివ్వడం, భూములను విక్రయించినప్పటికీ ఆన్లైన్లో సవరించకపోవడం, కొందరు వీఆర్వోలు అవినీతికి పాల్పడి బోగస్ పాసు పుస్తకాలను సృష్టించి కూడా బోగస్ లబ్ధిదారులను చేర్చడంతోనే ఆర్ఎస్ఆర్ సమస్య ఉత్పన్నమైంది. తదనంతరం ఆర్ఎస్ఆర్ సమస్య ఉన్న భూములన్నింటిని చాలా వరకు జిల్లా రెవెన్యూ యంత్రాంగం పరిష్కరించింది.
భూ సమస్యలకు చెక్
ధరణి పోర్టల్తో భూ సమస్యలకు పూర్తిస్థాయిలో చెక్ పడనున్నది. ప్రతి రైతు తమ భూమి వివరాలను ధరణిలో చూసుకోవచ్చు. భూ వివరాలు తప్పుగా నమోదు అయితే జిల్లా కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవచ్చు. ధరణి సమీకృత భూమి రికార్డులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ, వ్యవసాయేతర ప్రజల ఆస్తుల నమోదు ఉండే అధికారిక పోర్టల్. దేశంలోనే ప్రప్రథమంగా మన రాష్ట్రంలో ఈ విధమైన పోర్టల్ ప్రవేశపెట్టిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్దే. రిజిష్టేషన్ ప్రక్రియలో లొసుగులను తొలగించడం కోసం ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
– గొల్ల అయ్యప్ప, కోకట్, యాలాల మండలం
నిమిషాల్లో భూమి రిజిస్ట్రేషన్..
ధరణి పోర్టల్ వచ్చిన తరువాత నిమిషాల్లో భూమి రిజిస్ట్రేషన్ అవుతుంది. గంటల తరబడి రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద పడిగాపులు కాయాల్సిన పని లేదు. స్లాట్ బుక్ చేసుకుంటే సమయం ఇస్తారు. సమయం వృథా కాకుండా అదే సమయానికి వెళ్లి పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రికార్డు మారడంతో పాటు వెంటనే పాస్బుక్లో కొనుగోలు చేసిన భూమి నమోదవుతుంది. అదే విధంగా అమ్మిన వ్యక్తి పాస్ బుక్ నుంచి అమ్మిన విస్తీర్ణం కట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ఆఫీసు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇందులో ఎవరి ఫైరవీ ఉండదు. ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు.
– సప్పిడి పెంటారెడ్డి, ముర్తుజాగూడ, మొయినాబాద్
ధరణితో మాన్యం భూములు పరిష్కారం
దోమ మండల పరిధిలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన గోవిందపురం రాజశేఖర్కు తన తాతల నాటి మాన్యం భూమిని రిజిస్ట్రేషన్ చేసిన అనంతరం పట్టాదారు రాజశేఖర్కు ప్రొసీడింగ్ను అందజేశారు. డిప్యూటీ తహసీల్దార్ విజయేందర్.
ధరణి పోర్టల్తో వేగంగా రిజిస్ట్రేషన్లు
భూముల రిజిస్ట్రేషన్లు ధరణి పోర్టల్ ద్వారా వేగంగా జరుగుతున్నాయి. వికారాబాద్ పట్టణం ఎన్నెపల్లిలో 3 ఎకరాల భూమిని మరో వ్యక్తి నుంచి కొనుగోలు చేశా. భూమి రిజిస్ట్రేషన్ కోసం ఈ నెల 29న స్లాట్ బుక్ చేసుకోగా 30వ తేదీన రిజిస్ట్రేషన్కు బుక్ అయింది. వికారాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో 10 నిమిషాల్లోనే నా పేరుపై రిజిస్ట్రేషన్ జరిగింది. వెంటనే మ్యుటేషన్ జరిగి వారం రోజుల్లో ఇంటికే పాస్ బుక్ వస్తుంది. గతంలో రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. పాస్ బుక్కులు కూడా నెలల తరబడి పెండింగ్లో ఉండేవి.
– ఇఫ్తేకర్, వికారాబాద్
అవకతవకలను అరికట్టేందుకే ధరణి
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్తో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభతరంగా మారింది. భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే దళారులకు అధిక డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. ధరణి వల్ల ఎవరికి రూపాయి చెల్లించకుండా స్లాట్ బుక్ చేసుకుని 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. సీఎం కేసీఆర్ రెవెన్యూ శాఖలో జరిగే అవకతవకలను అరికట్టేందుకే ధరణిని తీసుకువచ్చారు.
-ఫరీద్, మోకిల, శంకర్పల్లి
భూ రిజిస్ట్రేషన్ కష్టాలు తీరినయి..
గతంలో భూముల రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయం వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. తెలంగాణ సర్కార్ ధరణి పోర్టల్తో సమస్యను తొలగించింది. కేవలం 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. సామాన్య రైతులకు ఉపయోగకరంగా ధరణి పోర్టల్ను ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయం. అరచేతిలో స్మార్ట్ఫోన్ ఉంటే చాలు ధరణి పోర్టల్తో భూమికి సంబంధించిన అన్ని విషయాలను కార్యాలయం వెళ్లకుండా తెలుసుకోవడం సంతోషంగా ఉంది.
– నరేందర్రెడ్డి, బుచ్చిగూడ రైతు, షాద్నగర్
భూ మార్పిడి సులభతరం
వ్యవసాయ భూముల రిజిస్టేషన్లు మండల స్థాయిలోని తహసీల్దార్ కార్యాలయంలోనే నిమిషాల వ్యవధిలో జరుగుతుండటంతో భూ మార్పిడి ప్రక్రియ సులభమైంది. గతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద ఎక్కువ సమయం వేచి ఉండే పరిస్థితి ఉండేది. నేడు అనుకున్న సమయానికి వచ్చి తమ పనిని పూర్తి చేసుకొని సంతోషంగా ఇంటికి వెలుతున్నాం.
– పిల్లి అంజిలయ్య, రైతు, దిర్సంపల్లి, దోమ మండలం