షాబాద్, ఫిబ్రవరి 2 : మండలంలోని పోతుగల్ లో రైతు సాగుచేసిన వరిపంటను గురువారం రాజేంద్రనగర్ వరి పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త ఎల్. కృష్ణ, సీనియర్ శాస్త్రవేత్త చంద్రమోహన్ పరిశీలించారు. పోతుగల్ తండాలో కేతావత్ కిషన్నాయక్ అనే రైతు వానకాలం సీజన్లో సాగు చేసిన బయోజీన్ కంపెనీకి చెందిన గంగోత్రి రకం వరి పంట పొలాన్ని సందర్శించారు. పంట మొత్తం గింజ పట్టక తాలు పోయిందని రైతు తెలిపారు. దీంతో శాస్త్రవేత్తలు రైతును వరినాటిన తేదీ వివరాలు, ఎరువుల వాడకం, పురుగు, శిలీంద్రనాశనుల వాడకం వివరాలు తెలుసుకున్నారు. త్వరలో వరిపంట తాలుగా మారడానికి కారణాలను నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు.
రైతులు పంటలు సాగేటప్పుడు వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించారు. వారి వెంట మండల వ్యవసాయాధికారి వెంకటేశం, ఏఈవో కిరణ్మయి, బయోజీన్ కంపెనీ ఫీల్డ్ ఆఫీసర్ రమేశ్బాబు, కిసాన్ ఫర్టిలైజర్ డీలర్ శ్రీనివాస్రెడ్డి, రైతులు కేతావత్ కిషన్నాయక్, రవీందర్నాయక్ ఉన్నారు.