వికారాబాద్, ఏప్రిల్ 19 : విత్తనాల విక్రయాల్లో రైతులకు నకిలీ, లూజ్, గుర్తింపు పొందని పత్తి విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లో అమ్మరాదని వికారాబాద్ జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ శుక్రవారం తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు తప్పనిసరిగా అధీకృత డీలర్ వద్ద మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలన్నారు. విత్తనాలు కొన్న తర్వాత రసీదును తీసుకోవాలని సూచించారు.
పంట కాలం పూర్తి అయ్యే వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు. గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు నకిలీ విత్తనాలను, ప్యాకెట్లలో కాకుండా లూజ్ పత్తి విత్తనాలను విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే దగ్గరలో ఉన్న మండల వ్యవసాయ అధికారికి సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. అట్టి అపరిచిత వ్యక్తుల వద్ద ఉన్న నిల్వను స్వాధీనం చేసుకోవడంతో పాటు, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.