షాబాద్, ఫిబ్రవరి 3 : రైతులు పండించిన పంటను మార్కెట్లో ఇబ్బందులు లేకుండా అమ్ముకునేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తున్నది. గ్రామాల్లో ఏ రైతు, ఏ సర్వే నంబర్లో, ఏ పంట వేశాడో అనే వివరాల సేకరణకు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టింది. రైతుల పంటల పూర్తి వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తున్నది. ఈ యాసంగి సీజన్లో రంగారెడ్డి జిల్లాలో 99,306 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 29,466 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఈ నెల చివరి వరకు వరితో పాటు ఇతర పంటలు సాగు చేసుకునే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈవోలు) ప్రతి గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పంటల సాగు వివరాలను సేకరించి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. వీటి ఆధారంగానే రానున్న రోజుల్లో రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేసే ఆవకాశం ఉంటుంది.
జిల్లావ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు(కల్వకుర్తి), మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ నియోజకవర్గాల పరిధిలోని 23 మండలాల్లో ఈ ఏడాది యాసంగి సీజన్కుగాను 99,306 ఎకరాల్లో పంటల సాగు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 29,466 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేశారు. ఇందులో వరి 13,111 ఎకరాల్లో సాగు చేయగా, మరో 11,360 ఎకరాలకు సంబంధించిన నారు నర్సరీల్లో సిద్ధంగా ఉన్నది.
జొన్న 551, మొక్కజొన్న 1596, వేరుశనగ 6113, పొద్దుతిరుగుడు 264, కుసుమపువ్వు 2165, ఆముదం 118, ఇతర పంటలు 1725 ఎకరాల్లో సాగు చేయగా, 3851 ఎకరాల్లో కూరగాయల పంటలు సాగు చేశారు. సాగు చేసిన పంటల్లో ఇప్పటివరకు 20,888 ఎకరాల పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. జిల్లావ్యాప్తంగా 83 మంది ఏఈవోలు ప్రతి గ్రామంలో పంటల సాగు వివరాలను సేకరిస్తున్నారు. జిల్లాలోని ఆయా మండలాల్లోని గ్రామాల్లో 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్గా విభజించి, ఆ పరిధిలో పంటల సాగు వివరాల సేకరణ బాధ్యత ఏఈవోలకు అప్పగించారు. ప్రస్తుతం జిల్లాలో పంటల సాగు లెక్కల సేకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది.
రైతులు సాగు చేసిన పంటల వివరాలను సేకరించిన ఏఈవోలు వెంటనే ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 20,888 ఎకరాల పంటల సాగు వివరాలు ఆన్లైన్లో నమోదు చేశారు. రైతుల ఫోన్ నంబర్లు కూడా నమోదు చేస్తున్నారు. ప్రతి గుంటలో సాగు చేసిన పంటల పూర్తి వివరాలు అధికారులు పకడ్బందీగా సేకరిస్తున్నారు. దీంతో ఆన్లైన్లో ఏ ఊరిలో, ఏ రైతు, ఏ పంట, ఎన్ని ఎకరాల్లో సాగు చేశారో తెలిసిపోతుంది. ఈ నెల చివరి వరకు పంటల సాగు సేకరణ వివరాలు పూర్తి చేసి ఆన్లైన్లో నమోదు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
రైతులు పండించిన పంటలను ఇబ్బందులు లేకుండా మార్కెట్లో అమ్ముకునేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నది. ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతు ఆ పంటను అమ్ముకోవాలంటే ఎలాంటి కష్టాలు ఉండకూడదనే లక్ష్యంతో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పంటల సాగు వివరాల సేకరణ చేపడుతున్నారు. వ్యవసాయశాఖ అధికారులు నమోదు చేస్తున్న లెక్కల్లో వివరాలు ఉంటేనే పంటలను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది.
వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం ఆన్లైన్లో నమోదైన పంటల వివరాల ప్రకారమే ఆయా రైతుల పంటల దిగుబడుల కొనుగోలుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వనున్నది. ఎఫ్సీఐ, మార్క్ఫెడ్, ఐకేపీ, పీఏసీఎస్ల ద్వారా రైతుల నుంచి వరి, మొక్కజొన్న, జొన్న తదితర పంటల దిగుబడులను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. ఆన్లైన్లో వివరాలు లేని రైతుల నుంచి పంటల దిగుబడుల కొనుగోలును నిరాకరించే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రతి రైతు తాము సాగుచేసిన పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయించాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.
జిల్లాలో పంటల సాగు వివరాల సేకరణ కార్యక్రమం పకడ్బందీగా కొనసాగుతున్నది. యాసంగిలో రైతులు సాగుచేసిన పంటల వివరాలను తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలి. ప్రస్తుతం సేకరించిన వివరాల ఆధారంగానే పంటల ఉత్పత్తులు మార్కెట్లో అమ్ముకునే అవకాశం ఉంటుంది. జిల్లావ్యాప్తంగా ఈ యాసంగి సీజన్లో 99,306 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 29,466 ఎకరాల్లో పంటలు సాగు చేశారు.
ఈ నెల చివరి వరకు పంటలు సాగు చేసుకునే అవకాశం ఉన్నది. ఏఈవోలు గ్రామాల్లో పర్యటించి రైతుల పంటల వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు 20,888 ఎకరాల పంటల వివరాలు ఆన్లైన్లో నమోదు చేశారు. జిల్లాలో జరుగుతున్న పంటల వివరాల సేకరణను ఎప్పటికప్పుడూ పరిశీలిస్తున్నాం. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ పంటల వివరాలు ఏఈవోల వద్ద నమోదు చేయించుకోవాలి.
– గీతారెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి