పెద్దేముల్ : ట్రాన్స్ఫార్మర్ జంపర్ వైర్లు ఒకటికోకటి తాకడంతో మంటలు చెలరేగి చెరుకు పంట దగ్దమై లక్షల్లో ఆస్తి నష్టమైన సంఘటన పెద్దేముల్ మండలం బండమీదిపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. ప్రత్యేక్ష సాక్షులు, రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్రాన్స్ఫార్మర్ జంపర్వైర్లు ఒకటికొకటి తాకడంతో మంటలు చెలరేగి నిప్పు రవ్వలు చెరుకు పంటపై పడడంతో మంటలు వ్యాపించాయి. చూసిన ప్రత్యేక్ష సాక్షులు వెంటనే చెరుకు రైతులకు సమాచారమందించారు. వెంటనే పైర్ సిబ్బందితో పాటు ఎంఆర్ఓ రమేశ్కు సమాచారం తెలిపారు. రైతులు ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసి మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు.
గౌరళ్ల చిన్నమ్మకు చెందిన 15టన్నులు, సాయమ్మకు చెందిన 40టన్నులు, మ్యాతరి అంతప్పకు చెందిన 89 టన్నులు మొత్తంగా 144 టన్నుల చెరుకు అగ్నికి ఆహుతైంది. ఆరుగాలం కుటుంబ సభ్యులందరూ కష్టపడి పండించిన పంట కళ్లముందే అగ్నికి ఆహుతి అవడంతో రైతులు కన్నీరుమున్నిరై లబోదిబోమన్నారు. ఎలాగైనా తమకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వమే పెద్దమనస్సుతో ఆదుకోవాలని వేడుకొన్నారు.