ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 18 : రాష్ట్రంలో రైతులు వరికి బదులుగా ఇతర పంటలపై దృష్టి సారించాలని ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు, ప్రచారం చేస్తున్నది. ముఖ్యంగా రైతులు ఆరుతడి పంటలైన కూరగాయలు, పప్పుదినుసులు సాగుచేయాలని ప్రభుత్వం తెలియజేస్తున్నందున ప్రతిరైతు తమ వ్యవసాయ పొలాల్లో అనుకూలంగా పండేపంటల వివరాలు తెలుసుకునేందుకు రైతులు తమ వ్యవసాయ పొలాల్లో మట్టి నమూనాలు సేకరించి భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకుని అనుకూలమైన పంటలను సాగుచేసుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధించుకునేందుకు అవకాశముందని ప్రతిరైతు భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకుంటే ఎంతో మేలని వ్యవసాయ నిపుణులు అంటున్నారు.
రైతు తన పొలంలో అధిక దిగుబడి పొందాలన్నా రసాయన ఎరువుల వాడకం తగ్గించాలన్నా ముందుగా భూసార పరీక్షలు చేయించాలి. మట్టి స్వభావం తెలుసుకోవాలన్నా భూమిలో ఎలాంటి పంటలు పండించుకోవాలన్నా ఏయే ఎరువులు ఎంత మోతాదులో వాడాలో తెలుసుకోవాలన్నా పరీక్ష ఫలితాలకు అనుగుణంగా వాడితే రైతుకు పెట్టుబడి తగ్గడమే కాకుండా ఆశించిన దిగుబడులు వచ్చే అవకాశముంది.
ప్రస్తుతం పంటల సాగుకోసం తెలంగాణ వ్యాప్తంగా వ్యవసాయ అధికారులు భూసార పరీక్షలు నిర్వహించేందుకు మట్టి నమూనా సేకరిస్తున్నారు. భూసార పరీక్ష వల్ల కలిగే లాభాలను రైతులకు వివరిస్తున్నారు. యాసంగి పంటల సాగు ప్రారంభంకానున్న నేపథ్యంలో భూసార పరీక్షలకు తరుణమిదేనని అధికారులు పేర్కొంటున్నారు. పంటలు సాగుచేసుకునే ప్రతి రైతు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలని వ్యవసాయాధికారులు తెలుపుతున్నారు.
రైతు తన పొలంలో ఒక ఎకరంలో కనీసం ఆరు నుంచి ఎనిమిది చోట్ల ఆంగ్ల అక్షరం వీ(V)ఆకారంలో ఆరు నుంచి ఎనిమిది అంగుళాల లోతు వరకు అంచు మట్టిని తీయాలి. సేకరించిన నమూనాలను బాగా కలిపి శుభ్రమైన గోనె సంచిలో తీసుకోవాలి. ఆ మట్టిని నీడలో పరిచిఆరబెట్టాలి. తర్వాత మట్టిని ఒక పొరగా చేసి నాలుగు భాగాలుగా విభజించాలి. మూలలకు ఎదురుగా ఉన్న మట్టిని తీసుకుని మిగిలిన మట్టిని పారేయాలి. ఇలా కనీసం అరకిలో మట్టి వచ్చే వరకు తీసుకోవాలి.
ఇలా తీసుకున్న మట్టిని ఒక ప్లాస్టిక్ సంచిలో వేసి రైతు వివరాల వాటిలో ఉంచాలి. భూసార పరీక్షల కేంద్రానికి వ్యవసాయశాఖ అధికారి ద్వారా పంపించాలి. మట్టిని భూసార పరీక్ష కేంద్రంలో పరీక్ష చేసి మట్టిలో ఉన్న లవణాలు, సేద్రియ కర్బనాలు, నత్రజని, భాస్వరం పొటాష్ తదితర పోషకాల స్థాయిని అధిక దిగుబడికి వాడాల్సిన ఎరువుల మోతాదును సూచిస్తారు.
పొలాల్లోని ప్రధాన పోషకాలు, సూక్ష్మ పోషకాల స్థాయిని తెలుసుకోవచ్చు. మట్టి పరీక్షల ఫలితాలతో ఏ పంట వేయాలి. ఏ పంటకు ఏయే ఎరువులు ఏ మోతాదులో వేయాలి. అనే విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది.
పంట పొలాల్లో చౌడ ఆమ్లస్థాయిని నిర్ధారించి వాటిని తగ్గించేందుకు అవసరమైన యాజమాన్య పద్ధతులు పాటించే అవకాశం ఉంటుంది. రసాయన ఎరువులపై అనవసర ఖర్చును తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
భూసార పరీక్షకు సేకరించిన మట్టిని వ్యవసాయాధికారులు పరీక్షా కేంద్రాలకు పంపుతారు. అధికారులు పంపిన తర్వాత ఇరవై నుంచి ముప్పై రోజుల్లో ఫలితాలను ఆన్లైన్లో అందజేస్తారు. దీంతోపాటు రైతుకు భూసార పరీక్షలకు సంబంధించిన ఆరోగ్యకార్డును అందజేస్తారు. ప్రస్తుతం భూసార పరీక్షల మట్టిని సేకరించి అందిస్తే కనీసం నెలరోజుల వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏటా సగం రైతులకు సంబంధించిన భూసార పరీక్షలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే సగం మంది రైతులకు చెందని భూసార పరీక్షలు పూర్తిచేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు.
రైతులు భూసార పరీక్షలు చేయించుని తమ వ్యవసాయ పొలాల్లో అనుకూలమైన పంటలను సాగుచేసుకునేందుకు వీలుంటుంది. అదేవిధంగా అధిక దిగుబడులు సాధించేందుకు సులువుగా ఉంటుంది. భూ సారాన్ని బట్టి ఎంతమేరకు ఎరువులను వాడవచ్చనేది తెలిస్తుంది. ప్రస్తుతం రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు తమ పొలాల్లో ఏయేపంటలు సాగుచేసుకుంటే బాగుంటుందో తెలుసుకునేందుకు భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. రైతులు భూసార పరీక్షలు చేయించడం ద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చు.
– సత్యనారాయణ, ఏడీఏ , వ్యవసాయ శాఖ ఇబ్రహీంపట్నం