వ్యవసాయానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించేందుకు ప్రభుత్వం నేటి నుంచి రంగారెడ్డి జిల్లాలో ‘వ్యవసాయ గణన’ను ప్రారంభించనున్నది. తొలిసారిగా మూడు దశల్లో డిజిటల్ పద్ధతిలో వివరాలను సేకరించి ఎప్పటికప్పుడు మొబైల్ యాప్లో నమోదు చేయనున్నారు. మొదటి దశలో రైతు పేరు, సామాజిక స్థితి, భూ విస్తీర్ణం, వ్యక్తిగత సాగు, ఉమ్మడి సాగు, సంస్థాగత సాగు, పురుషులు, మహిళలు తదితర వివరాలను సేకరిస్తారు. రెండో దశలో భూ వినియోగం, ఏఏ పంటలు ఎన్నెన్ని ఎకరాల్లో సాగు, నీటి వసతి వంటి వివరాలను తెలుసుకోనున్నారు. మూడో దశలో ఎంపిక చేసిన కమతాల్లో ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం, పశు సంపద, వ్యవసాయ పరికరాలు మొదలగు వివరాలను సేకరిస్తారు. ఇందుకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు, గణాంక శాఖ అధికారులకు శిక్షణ కూడా ఇచ్చారు. త్వరితగతిన సాగు వివరాలను సేకరించేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తున్నది.
– రంగారెడ్డి, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): ‘వ్యవసాయ శాఖకు సంబంధించిన సమగ్ర సమాచారం సేకరణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న ‘వ్యవసాయ గణన’ జిల్లాలో నేటి నుంచి మొదలుకానుంది. ప్రతి ఐదేండ్లకోసారి ఈ గణనను నిర్వహిస్తుండగా..కరోనా కారణంగా రెండేండ్లు ఆలస్యంగా చేపడుతున్నారు. గతంలో గణన వివరాలను కాగితాల్లో నమోదు చేయగా..ఈసారి డిజిటల్ పద్ధతిలో చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇటీవలనే జిల్లాలో సంబంధిత అధికారులకు శిక్షణ కూడా ఇచ్చారు. ఈనెల 15లోపుగా గణనను పూర్తి చేసేలా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నది.’ ఏ నేలల్లో ఏయే రకాల పంటలను రైతులు సాగు చేస్తున్నారో తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రతి సీజన్లో పంటల వివరాలను సేకరిస్తున్నది. ఈ క్రమంలో ప్రస్తుత వానకాలం సీజన్లో కూడా ఏఈవోలు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటల వివరాలను యాప్లో నమోదు చేస్తున్నారు. తాజాగా.. గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా ఏఈవోలు ‘వ్యవసాయ గణన’ను మొదలు పెట్టనున్నారు. భారత ప్రభుత్వం 1970-71 సంవత్సరం నుంచి ప్రతి ఐదేండ్లకోసారి ‘వ్యవసాయ గణన’ను చేపడుతూ వస్తున్నది. గత 2015-16 సంవత్సరంలో పదో విడుతలో వ్యవసాయ గణనను చేపట్టారు. 2021-22లో చేపట్టాల్సి ఉండగా.. రెండేండ్లుగా వాయిదా పడుతూ వచ్చింది. 2022-23కు సంబంధించి 11వ విడుత గణనను ప్రస్తుతం జిల్లాలో నిర్వహిస్తున్నారు.
సామాజిక వర్గాల వారీగా రైతుల సంఖ్య, సాగు విస్తీర్ణం, ఏయే పంటలను సాగు చేస్తున్నారు.. వంటి సమగ్ర సమాచారాన్ని ఏఈవోలు క్షేత్రస్థాయిలో సేకరించనున్నారు. నీటి వినియోగం, వ్యవసాయానికి ఏయే యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. కౌలు రైతులు, సాగు నీటి వనరులు ఇలా.. వ్యవసాయానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించనున్నారు. భూ కమతాల వారీగా రెవెన్యూ గ్రామాన్ని యూనిట్గా తీసుకుని సర్వే చేయనున్నారు. మూడు దశల్లో భాగంగా చేపడుతున్న ఈ సర్వేలో భాగంగా..మొదటి దశలో రైతు పేరు, సామాజిక స్థితి, భూ విస్తీర్ణం వివరాలు, వ్యక్తిగత సాగు, ఉమ్మడి సాగు, సంస్థాగత సాగు, పురుషులు, మహిళలు, ఇతరుల వారీగా వివరాలు తీసుకుంటారు. రెండో దశలో భూ వినియోగం, ఏయే పంటలు ఎన్నెన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు. నీటి వసతి తదితర వివరాలను సేకరిస్తారు. మూడో దశలో ఎంపిక చేసిన కమతాల్లో ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం, పశు సంపద, వ్యవసాయ పరికరాలు మొదలగు వివరాలను సేకరిస్తారు.
గతంలో గణన వివరాలను కాగితాల్లో నమోదు చేసేవారు. ఈసారి తొలిసారిగా డిజిటల్ పద్దతిలో చేపడుతున్నారు. ఏఈవోలు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ల ద్వారా డిజిటల్ విధానంలో మొబైల్ యాప్ ద్వారా వివరాలు సేకరించి ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకం కోసం రైతులకు సంబంధించిన ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, ఎంత భూమి ఉందనే వివరాలను వ్యవసాయ శాఖ సేకరించింది. ఇంకా ఈ వివరాలు ఇవ్వని వారి నుంచి మరోసారి సేకరించడంతోపాటు ఇతరత్రా అదనపు సమాచారాన్ని సేకరించనున్నారు. సర్వే నిర్వహణకు జిల్లా స్థాయిలో కమిటీని ఏర్పాటు చేశారు. కలెక్టర్ చైర్మన్గా, సీపీవో కన్వీనర్ మెంబర్గా, జిల్లా వ్యవసాయధికారి సభ్యుడిగా కమిటీలో ఉంటారు. ఉప గణాంక, మండల గణాంక అధికారులు ఎప్పటికప్పుడు సర్వేను పర్యవేక్షించి సాంకేతిక సలహాలు అందించేలా ఏర్పాట్లు చేశారు. వ్యవసాయ గణనను ఈనెల 15లోపుగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి తెలిపారు.