మోమిన్పేట, మార్చి 30 : తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాతే సీఎం కేసీఆర్ నేతృత్వంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సహకారంతో గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందుతున్నాయి. సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తూ ఎనిమిదేండ్లలోనే ఎనలేని అభివృద్ధికి బాటలు వేశారు. గ్రామాల్లో డంపింగ్ యార్డు, రైతు వేదికలు, ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, నూతన పంచాయతీ భవనాలు నిర్మించేందుకు ఎంతో కృషి చేశారు. కేసీఆర్ పాలనలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు గ్రామాల అభివృద్ధికి చర్యలు చేపట్టారు. దీని ఫలితంగా గ్రామ పంచాయతీలు జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డులకు ఎంపికై పురస్కారాలను అందుకుంటున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి, హరితహారం, రోడ్లు, అండర్ డ్రైనేజీ, డంపింగ్ యార్డు, ప్రకృతివనం, వైకుంఠధామం తదితర అభివృద్ధి పనులను చీమలదరిలో సర్పంచ్ నర్సింహారెడ్డి వంద శాతం పూర్తి చేశారు. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గ్రామాభివృద్ధికి సర్పంచ్ ప్రత్యేక కృషి చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు విస్తృతంగా నిధులు కేటాయించి అన్ని రంగాల్లో అభివృద్ధి పనులు చేపట్టింది. మోమిన్పేట మండలంలో 28 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 15 జాతీయ ఉత్తమ పంచాయతీల అవార్డులు అందుకున్నాయి. చీమలదరి గ్రామం జాతీయ ఉత్తమ పంచాయతీ మండల స్థాయి అవార్డులు మూడు, జిల్లా స్థాయిలో ఉత్తమ సుపరిపాలను గ్రామ పంచాయతీ అవార్డు అందుకొని ఉత్తమ సుపరిపాలన రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపికైనది.
చీమలదరిని సకల సౌకర్యాల పంచాయతీగా తీరిదిద్దడమే లక్ష్యంగా కృషి చేస్తున్నా. సీఎం కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న నిధులతో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. జిల్లాలోనే నంబర్ వన్గా పంచాయతీ భవనం, పల్లెప్రకృతి వనాలను తీర్చిదిద్దాం. గ్రామ సభలు నిర్వహిస్తూ అభివృద్ధి, సంక్షేమ అంశాలను చర్చించి తీర్మానిస్తున్నాం. గ్రామంలో జరుగుతున్న అన్ని రంగాల అభివృద్ధికి జాతీయ ఉత్తమ పంచాయతీ మండల స్థాయి అవార్డులు మూడు, జిల్లా స్థాయి సుపరిపాలన అవార్డు అందుకున్నందుకు, జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డు సుపరిపాలనలో భాగంగా రాష్ట స్థాయికి ఎంపిక కావడం సంతోషంగా ఉంది.
– ఎన్.నర్సింహారెడ్డి, సర్పంచ్, చీమలదరి
తెలంగాణ ప్రభుత్వం, జిల్లా, మండల అధికారుల ఆదేశాలతో సర్పంచ్ ప్రత్యేక కృషితో గ్రామంలో అన్ని అభివృద్ధి పనులు చేపట్టి పచ్చదనం, పరిశుభ్రంగా మార్చుకున్నాం. సంక్షేమ పథకాలను ప్రజలకు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ-పంచాయతీ ఆన్లైన్ ద్వారా జనన, మరణ, ఆసరా పింఛన్లు, రేషన్, గృహ నిర్మాణాలు, ప్లాట్ల ఏర్పాటు, లేఔట్స్, ఇంటి పన్ను తదితర అన్ని పనులను నమోదు చేస్తున్నాం. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు మండల, జిల్లా స్థాయి అవార్డులు అందుకోవడంతో పాటు రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపిక కావడం సంతోషంగా ఉంది.
– సుగుణ, పంచాయతీ కార్యదర్శి, చీమలదరి
సీఎం కేసీఆర్ పరిపాలనలో ప్రజలకు అవసరమైన ప్రభుత్వ పనులను ఆన్లైన్ ద్వా రా సకాలంలో చేసుకుంటున్నారు. గతం లో మండల కేంద్రం చుట్ట్టూ తిరిగినా అవసరమైన ధ్రువీకరణ పత్రాలు వచ్చేవి కా వు. నేడు ఆన్లైన్ ద్వారా సకాలంలో అం దుతున్నాయి. నా కుమారుడు బర్త్ సర్టిఫికెట్ కోసం సంబంధిత పత్రాలతో మా గ్రామ పంచాయతీలో కార్యదర్శికి అందించా. ఆన్లైన్లో వివరాలు నమోదు చేసి సకాలంలో అందించారు. గ్రామానికి సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి అందిస్తున్న సేవలు ఉత్తమం. – బక్కయ్య, చీమలదరి గ్రామం
గ్రామ పంచాయతీకి సంబంధించిన అన్ని ధ్రువ పత్రాలు గ్రామ పంచాయతీలోనే సకాలంలో అందుతున్నాయి. దీంతో మండల కేంద్రానికి వెళ్లే తిప్పలు తప్పాయి. మా గ్రామంలో అన్ని రకాల ఆన్లైన్ సేవలు అందిస్తున్నారు. దళారుల ప్రమేయం లేకుండా పంచాయతీ కార్యదర్శికి సరైన పత్రాలు అందిస్తే సకాలంలో జనన, మరణ, ఇండ్ల అనుమతి తదితర ధ్రువపత్రాలు ఇస్తున్నారు. సర్పంచ్ నర్సింహారెడ్డి గ్రామాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలు అభివృద్ధికి నోచుకుంటున్నాయి.
– కిష్టారెడ్డి, చీమలదరి గ్రామం