వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భూగర్భజలాలు పెరిగి, బోరుబావుల్లో నీరు చేరడంతో రైతులు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున వరి పంటను సాగు చేసుకుంటున్నారు. వరి పంట సాగు విషయంలో అధికారుల సూచనలు పాటించకుండా ఇష్టానుసారంగా ఎరువులు చల్లితే పెట్టుబడి పెరుగుతుంది తప్పా దిగుబడి రాదు. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఎరువుల వాడకంపై వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు పాటిస్తే మంచిది. భూసార పరీక్షల ఫలితాలకనుగుణంగా ఎరువులు వాడితే మంచి ఫలితాలు వస్తాయని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
– ఇబ్రహీంపట్నంరూరల్, ఆగస్టు 4
ఈసారి వర్షాలు సమృద్ధి కురువడం వల్ల సాగునీటికి ఢోకాలేదు. దీంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని రైతన్నలు అధికంగా వరి సాగు చేస్తున్నారు. వ్యవసాయాధికారుల సూచన మేరకు ఎరువులు వాడితే అధిక దిగుబడి వచ్చి లాభాలను ఆర్జించవచ్చని వ్యవసాయ శాఖ ఏడీఏ సత్యానారాయణ సూచిస్తున్నారు. వరి సాగు చేసిన రైతులు ఎకరానికి 25నుంచి 32కిలోల నత్రజని, 16కిలోల భాస్వరం, 12నుంచి 16కిలోల పొటాష్ లభించే ఎరువులను మాత్రమే వాడితే మంచిది. అంతకుమించి ఎరువులు వాడితే వరికి తెగుళ్లు సోకే ప్రమాదమున్నది. ఆయన సూచనలు ఇలా ఉన్నాయి..
వరిపైరు పెరిగేందుకు నత్రజని ఎంతగానో దోహదపడుతుంది. నత్రజనిని కాంప్లెక్స్ ఎరువుల రూపంలోగానీ, యూరియా రూపంలో గానీ వాడొచ్చు. దీనిని మూడు దఫాలుగా పొలంలో చల్లుకోవాలి. నాట్లు వేసే ముందు, దుబ్బు చేసే దశలో అంకురం ఏర్పడే దశలో నత్రజనిని అందించే ఎరువులను వాడుకోవాలి. నత్రజని పోషకాన్ని సరైన మోతాదులో అందించేందుకు యూరియా వాడే విధానంపై రైతులు దృష్టి సారించాలి. ఎకరానికి 25నుంచి 32కిలోల నత్రజని అందించాలంటే 55నుంచి 70కిలోల యూరియాను మూడు సమానభాగాలుగా విభజించి చల్లుకోవాల్సి ఉంటుంది. పైరు పెరుగుదల ఆశించిన స్థాయిలో లేకుండా అదనంగా 10 నుంచి 15 కిలోల వరకు యూరియా వాడొచ్చు. లేదంటే 50కిలోల యూరియాకి 10 కిలోల వేపపిండి లేక 250 కిలోల తేమ కలిగిన మట్టిని కలిపి రెండు రోజులు నిల్వ ఉంచి వెదజల్లితే నత్రజని వినియోగం పెరుగుతుంది. యూరియా అధికంగా వినియోగిస్తే అనార్థలు ఎదురవుతాయి.
మొక్కల వేర్ల పెరుగుదలకు పోషక పదార్థంగా భాస్వరం ఉపయోగపడుతుంది. దీనిని నాటు వేసే ముందు దమ్ములో, నాట్లు వేసిన 15 రోజుల్లోపు కాంప్లెక్స్ ఎరువుగా వాడాల్సి ఉంటుంది. భాస్వరం కలిగిన కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా వేయరాదు. నత్రజని ఎరువును బురద పదనులో వేసి తర్వాత నీరు పెట్టాలి. యూరియా చల్లిన 48 గంటల తర్వాత తప్పనిసరిగా పంటకు నీటిని అందజేయాలి.
సాధారణంగా జింకులోపం చలికాలం, చౌడు పొలాల్లో, మురుగు సమస్య ఉండే పంటచేళ్లలోనూ కనిపిస్తుంది. వరి నాటిన 2 నుంచి 4 వారాల్లో జింకు లోపం కనిపిస్తుంది. ముదురాకు చివర తుప్పు మచ్చలు ఏర్పడి, ఆకులు పెలుసుగా తయారవుతాయి. జింకులోపం నివారణకు 20కిలోల జింకు సల్ఫేటు, ఎకరానికి చివరి దమ్ములో వేయాలి. లేకపోతే 0.2 శాతం జింకు సల్ఫేటును, నాలుగైదు రోజులకొక్కసారి రెండు, మూడు పర్యాయాలు పైరు ఆకులు తడిచేటట్లు పిచికారీ చేయాలి. జింకు సల్ఫేటును ఎలాంటి పురుగు, తెగుళ్ల మందులతో కలిపి పిచికారీ చేయొద్దు. జింకు సల్ఫేట్ పిచికారీ చేసిన తర్వాత 25-30 కిలోల యూరియా ఎకరానికి పైపాటుగా వేయాలి.
రైతులు ప్రతిరోజూ తమ వ్యవసాయ పొలానికి వెళ్లి పంట పరిస్థితిని పరిశీలించాలి. అనుమానం వచ్చిన వెంటనే స్థానింగా వ్యవసాయ రైతు వేదికల్లో ఉండే అధికారులను సంప్రదించి వారి సలహాలు, సూచనలతో మందులను వాడాలి. వరిలో ఇనుము లోపం కూడా రావచ్చు. నివారణకు 20-30గ్రాముల అన్నభేది చూర్ణం, లేక మూడు గ్రాముల నిమ్మఉప్పు, లీటరు నీటిలో కలిపి పైరు బాగా తడిచేలా పిచికారీ చేయాలి. రైతులు ఎప్పుడు కూడా సొంత నిర్ణయాలు తీసుకోకుండా అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి.
– శ్రవణ్కుమార్, ఏఈవో ఇబ్రహీంపట్నం