పెద్దఅంబర్పేట, జూలై 21 : చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్తు తీగలు తెగిపడ్డాయా.? భారీ వానలకు స్తంభాలు వంగి ప్రమాదకరంగా తయారయ్యాయా? చేతికందే ఎత్తులో కరెంటు తీగలు వేలాడుతున్నా.. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియడంలేదా? అయితే ఇది మీ కోసమే. విద్యుత్తు సమస్యలు ఏవైనా సరే ఒక్క కాల్ చేస్తే పరిష్కరిస్తామని విద్యుత్తుశాఖ అధికారులు భరోసా ఇస్తున్నారు. ఎలక్ట్రికల్ కంట్రోల్ రూం (ఈసీఆర్) 1912 నంబర్కు ఫోన్ చేసి సమస్య చెప్పాలని సూచిస్తున్నారు. ఆ వెంటనే కంట్రోల్ రూం నుంచి క్షేత్రస్థాయిలోని అధికారులకు ఆ సమస్యను చేరవేస్తారని.. సమస్య పరిష్కారమయ్యే వరకు దాన్ని అనుసరిస్తారని పేర్కొంటున్నారు. ఒక్కసారి ఈసీఆర్కు ఫోన్ చేసి సమస్య చెప్తే చాలు.
అక్కడినుంచి ఫిర్యాదుదారు చేసిన సమస్యతోపాటు అతడి ఫోన్ నంబర్ను క్షేత్రస్థాయిలోని ఏఈకి తెలియజేస్తారు. ఏఈ సంబంధిత ఫిర్యాదుదారు ఫోన్ నంబర్కు కాల్ చేసి వివరాలు సేకరిస్తారు. ఆపై సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతారు. తర్వాత పరిష్కారానికి సంబంధించిన వివరణను సైతం ఉన్నతాధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. కరెంటుకు సంబంధించి ప్రజలకు ఎదురయ్యే ఎలాంటి సమస్యను అయినా తెలియజేయాలని కోరుతున్నారు. వర్షాల నేపథ్యంలో సరూర్నగర్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటుచేశారు. ఎస్ఈ పర్యవేక్షణలో ఇది నడుస్తుంది. ఆయా ఏరియాల వారీగా డీఈలు చూస్తారు. ప్రత్యేకంగా డిజాస్టర్ బృందం సైతం అందుబాటులో ఉంటుంది.
* ఎలక్ట్రికల్ కంట్రోల్ రూం (ఈసీఆర్): 1912
* విద్యుత్తుశాఖ ప్రత్యేక కంట్రోల్ రూం నంబర్: 79016 79095
* ఎఫ్వోసీ ఆటోనగర్: 94931 93148
* ఎఫ్వోసీ హయత్నగర్ : 94901 53577
* ఎఫ్వోసీ శాంతినగర్: 94901 53588
వర్షాలు కురుస్తున్న ప్రస్తుత తరుణంలో ఎట్టి పరిస్థితుల్లోనూ స్తంభాలు తాకొద్దు. కరెంటుకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే స్పందించేలా చర్యలు తీసుకుంటున్నాం. సమస్యాత్మక ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయంపై ఏఈలతో చర్చిస్తున్నాం. ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా నిరంతర సరఫరా కోసం అన్ని చర్యలు చేపడుతున్నాం.
– బండబావి యుగేందర్, అసిస్టెంట్ డివిజినల్ ఇంజినీర్ ఆపరేషన్, హయత్నగర్