‘దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర సర్కార్ వెన్నుదన్నుగా నిలుస్తున్నది.. వికారాబాద్ జిల్లాలో దళితబంధు కింద 358 మంది ఎంపికయ్యారు.. ఈ లబ్ధిదారుల ఐడెంటిఫికేషన్ను త్వరగా పూర్తి చేయాలి..’ అని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం వికారాబాద్ కలెక్టరేట్లో దళితబంధు, ‘మన ఊరు-మన బడి’ పథకాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈ నెలాఖరులోగా యూనిట్ల గ్రౌండింగ్ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఒక్కో లబ్ధిదారుడికి రూ.10 లక్షలు అందుతాయని, తమకు నచ్చిన యూనిట్ను నెలకొల్పుకోవచ్చన్నారు. మన ఊరు-మనబడితో సర్కారు బడులకు అన్ని మౌలిక వసతులను కల్పించనున్నామన్నారు. జిల్లాలో మొదటి విడుతగా విద్యార్థులు అధికంగా ఉన్న 371 పాఠశాలలు ఎంపికయ్యాయన్నారు. తరగతి గదులు, కిచెన్షెడ్లు, ప్రహరీలు, డైనింగ్హాల్ల నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణంతోపాటు విద్యుద్దీకరణ, తాగునీటి వసతి తదితర 12 అంశాలకు సంబంధించిన సదుపాయాలు కల్పించడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.
– పరిగి, ఫిబ్రవరి 8
పరిగి, ఫిబ్రవరి 8: దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు, సమాజంలో ఉన్నతంగా జీవించేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవా రం వికారాబాద్ కలెక్టరేట్లో దళితబంధు, ‘మన ఊరు-మన బడి’పై జరిగిన సమీక్షా సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మీడియాతో మాట్లాడారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇంతమంచి పథకం అమల్లో లేదని, సమాజంలోని అసమానతలను తొలగించేందుకు, వెనుకబడిన దళితులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి రూ. పది లక్షలు ఇవ్వాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచనని మంత్రి తెలిపారు. అందులో భాగంగానే మొదటి విడుతలో నియోజకవర్గంలోని వంద మందిని ఎంపి క చేసి రూ.పది లక్షలు అందించడం జరుగుతుందన్నారు. ఈ పథకంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్ది భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపారు. జిల్లాలో 358 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు, వారిని గుర్తించడం, బ్యాంకు ఖాతాలు తెరిపించడం, వారందరికీ సదస్సులను ఏర్పాటు చేసి అవగాహన కల్పించడంతోపాటు ఈనెలాఖరు వరకు అన్ని యూనిట్లు గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.
నియోజకవర్గంలోని వంద మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అమలుకు ప్రభుత్వం రూ.1200 కోట్లు విడుదల చేసిందని మంత్రి సబితారెడ్డి తెలిపారు. లబ్ధిదారులను ఎంపిక చేసి, వారు ఎంచుకున్న యూనిట్లు చక్కగా కొనసాగి వారు ఆర్థికంగా ఎదిగేందుకు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించినట్లు చెప్పారు. లబ్ధిదారులు తమకు నచ్చిన వ్యాపారాన్ని చేసుకోవచ్చని, ఇద్దరు, ముగ్గురు కలిసి కూడా పెద్ద వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందన్నారు. వంద శాతం సబ్సిడీపై లబ్ధి దారులకు దళితబంధు కింద రూ.10 లక్షలు వారి వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. రక్షణనిధిని ఏర్పాటు చేయడం ద్వారా లబ్ధిదారులకు రానున్న రోజుల్లో ఏదైనా ఇబ్బంది ఎదురైతే వారిని ఆదుకుంటుందన్నా రు. సీఎం కేసీఆర్ త్వరలోనే జిల్లాలో పర్యటిస్తారని, నూతన కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని ఆమె తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి సబితారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా బడుల్లో మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం రూ.7,289 కోట్లు మంజూరు చేసిందన్నారు. మొదటి విడుతలో రాష్ట్రంలోని 9,123 బడుల్లో రూ. 3,497 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. వికారాబాద్ జిల్లాలో మొదటి విడుతలో అధికంగా విద్యార్థులున్న 371 పాఠశాలలను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఇందులో భాగంగా తరగతి గదుల నిర్మాణం, కిచెన్షెడ్లు, ప్రహరీలు, డైనింగ్హాళ్లు, మరుగుదొడ్లు, తాగునీటి వసతి తదితర 12 అంశాలకు సంబంధించిన మౌలిక వసతులను కల్పించడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యేలు, జడ్పీచైర్మన్, ఎంపీపీలు, జడ్పీటీసీ లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మంత్రి సూచించారు. బడుల్లో వసతుల కల్పనకోసం నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు మంత్రి సబితారెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఇంటర్మీడియెట్ దశ చాలా ముఖ్యమైందని, కెరీర్ను మలుచుకునేందుకు ఈ రెండేండ్లు ఎంతో కీలకమని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. వికారాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో రూ. కోటీ20లక్షలతో మరో పది అదనపు తరగతి గదుల నిర్మా ణ పనులకు మంగళవారం ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ జీవితానికి ఇదొక మెట్టు అని, ఈ రెండేండ్లు కష్టపడి చదువాలని సూచించారు. తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చాలని సూచించారు. ఏప్రిల్ 20వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని, కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలన్నారు. అంతకుముందు మంత్రి సబితారెడ్డి సమీకృత జిల్లా కలెక్టరేట్ సముదాయంలో రూ.కోటితో చేపట్టనున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలె యాదయ్య, కొప్పుల మహేశ్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, రోహిత్రెడ్డి, రాష్ట్ర విద్యామౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నాగేందర్గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ, జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, జడ్పీ సీఈవో జానకిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబుమోజెస్, డీఆర్డీవో కృష్ణన్, డీఈవో రేణుకాదేవి, మున్సిపల్ చైర్పర్సన్ మంజులారమేశ్, ఎంపీపీ చంద్రకళ, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శంషాద్బేగం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.