రాజన్న సిరిసిల్ల, జూలై 23 (నమస్తే తెలంగాణ): తన చావుకు మోదీని కారణమంటూ వంశీ ఆత్మహత్య చేసుకోగా, నిరసనగా బీఆర్ఎస్ నేతలతో పాటు స్థానికులు ర్యాలీ చేపట్టారు. ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో ఆందోళన చేశారు. ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు.
ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీజే పీ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. ర్యాలీకి అనుమతి ఎలా ఇస్తారని ఓ కేంద్ర మంత్రి నేరుగా సిరిసిల్ల పోలీసులు ఉన్నతాధికారులకు ఫోన్ చేసినట్టు సమాచారం. వెంటనే సదరు పోలీసులపై చర్యలు తీసుకోవాలని సీరియస్ అయినట్టు సమాచారం. దీంతో ఎల్లారెడ్డిపేట ఎస్ఐ రాహుల్రెడ్డిని ఏఆర్ హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేశారు.
మరికొంత మందికి కూడా పోలీసులు నోటీసులు జారీచేసి వివరణ కోరినట్టుగా తెలుస్తున్నది. ఒకటి, రెండు రోజుల్లో వారిపై కూడా చర్యలు ఉంటాయని తెలుస్తున్నది. ర్యాలీ చేస్తున్న సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా తాము చర్యలు తీసుకుంటే.. తమపైనే వేటు వేయడం ఏమిటని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంలో కేంద్ర మంత్రి చెప్పిన వెంటనే.. పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారా..? ..రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో కేంద్ర మంత్రికి సహకరించిందా..? అన్న అనుమానాలు తలెత్తుతుతున్నాయి.