షాద్నగర్ టౌన్, మార్చి 5 : కళకు ప్రాణం పోసేది కళాకారులు. తమ కళతో పూర్వం నుంచి నేటి వరకు జరిగిన, జరుగుతున్న ఎన్నో విషయాలను కండ్లకు కట్టినట్టు చూపించే వారు కళాకారులు. కానీ అప్పట్లో తమ ప్రతిభను చూపించేందుకు సరైన వేదిక ఉండేది కాదు. ఎక్కడో ఒక చోట అద్దె చెల్లించి లేదా టెంట్ స్టేజీని ఏర్పాటు చేసుకుని కళను ప్రదర్శించే పరిస్థితి. గత ప్రభుత్వాలు కళాకారులను ప్రోత్సహించిన దాఖలాలు లేవు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కళకు ప్రాణం పోసింది. కళాకారుల కోసం ప్రత్యేక వేదికలను నిర్మిస్తున్నది. షాద్నగర్ పట్టణంలో 1.18 ఎకరాల విస్తీర్ణంలో కళా క్షేత్ర నిర్మాణానికి మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ శంకుస్థాపన చేశారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 5కోట్లను కేటాయించగా, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
కళా రంగంలో ప్రత్యేక గుర్తింపు..
కళా రంగంలో షాద్నగర్ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉన్నది. షాద్నగర్ పట్టణంతో పాటు వివిధ గ్రామాల్లో రంగస్థల, సినీ, ప్రాచీన సాహిత్య భజన, జానపద కళాకారులు ఉన్నారు. ఇక్కడి కళాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభను చూపి ఔరా అనిపించారు. రాష్ట్రస్థాయి బాలల నాటకోత్సవం, నృత్య ప్రదర్శన వంటి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారు. కళాకారులకు సరైన కళా క్షేత్రం ఉండాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ చేసిన కృషికి కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర సర్కార్ కళాకారులను ప్రోత్సహిస్తున్నది..
రాష్ట్ర ప్రభుత్వం కళాకారులను ప్రోత్సహిస్తున్నది. షాద్నగర్లో అద్భుతమైన కళా క్షేత్రాన్ని నిర్మిస్తున్నది. కళాకారులు తమ ప్రతిభను చూపేందుకు ఈ వేదిక ఉపయోగపడనున్నది. కళా క్షేత్రాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్కు కృతజ్ఞతలు.
– లింగం, ఆర్ఎల్ఆర్ డ్యాన్స్ మాస్టర్ షాద్నగర్
అద్భుతమైన కళా క్షేత్రం..
షాద్నగర్ పట్టణంలో అద్భుతమైన కళా క్షేత్రం నిర్మాణమవుతున్నది. ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న కళాకారుల కల నెరవేరనున్నది. కళా ప్రదర్శనను తిలకించేందుకు వచ్చే ప్రజలకూ ఇబ్బందులు కలుగుకుండా సకల సౌకర్యాలతో కళా క్షేత్రాన్ని నిర్మించడం సంతోషకరం.
– రమేశ్చారి, శ్రీ కళాజ్యోతి సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు షాద్నగర్
కళా ప్రదర్శనకు ఉపయోగం..
నూతన కళా క్షేత్రం కళాకారుల ప్రదర్శనకు ఉపయోగపడనున్నది. గతంలో కళా క్షేత్రం లేక ఇబ్బందులు పడ్డాం. కార్యక్రమాల కోసం అద్దెకు ఫంక్షన్హాల్ను తీసుకునేవాళ్లం. ప్రస్తుతం అత్యాధునిక వసతులతో స్థానికంగా కళా క్షేత్రం నిర్మించడం ఆనందంగా ఉన్నది.
– టీవీ రంగయ్య, సెన్సార్ బోర్డు సభ్యుడు, షాద్నగర్