బడంగ్పేట, మే 14 : భార్యాభర్తల మధ్యన జరిగిన ఓ చిన్నపాటి గొడవతో క్షణికావేశానికి గురైన ఓ తల్లి చనిపోవాలని నిర్ణయించుకున్నది. తాను చనిపోతే తన పిల్లలు అనాథలుగా మారిపోతారని భావించి కంటికి రెప్పలా చూసుకుంటున్న తన ఇద్దరు పిల్లలను టబ్బులో ముంచి చంపేసింది. అనంతరం తాను సైతం గుర్తు తెలియని విషం తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతున్నది. ఈ సంఘటన మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది.సీఐ మహేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం, కుబ్యా తండాకు చెందిన నేనావబత్ భారతికి అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్తో 2020లో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు.
పెద్ద కొడుకు విక్కి(ఏడాదిన్నర), చిన్న కుమారుడు (8 నెలలు)తో కలిసి మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలోని లలితానగర్లో నివాసముంటున్నారు. శనివారం ఉదయం భర్త శ్రీనివాస్ తల్లి ఇంటికి రావడంతో భార్యాభర్తల మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకున్నది. ఆదివారం ఉదయం భార్య తల్లిదండ్రులు కూడా ఇంటికి వచ్చారు. వీరు ఉండగానే భార్యాభర్తలు గొడవపడ్డారు. అనంతరం భర్త బయటకు వెళ్లగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో భార్య భారతి తన ఇద్దరు పిల్లలను వాటర్ టబ్బులో ముంచి చంపేసింది. తాను సైతం గుర్తు తెలియని విషం తీసుకుని ఆత్మహత్యానికి పాల్పడింది. ఈ విషయాన్ని భర్తకు ఫోన్లో తెలిపింది. వెంటనే భర్త వచ్చి ఇద్దరు పిల్లలను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భార్యను చికిత్స నిమిత్తం ఉస్మానియా దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతున్నది. పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు.