బడంగ్పేట, జనవరి 29 : బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం మేయర్, డిఫ్యూటీ మేయర్, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కార్పొరేటర్లందరూ సమన్వయంతో పార్టీని ముందుకు నడిపించాల్సిన అవసరముందని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకొనిపోవాల్సిన ఆవశ్యకత బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులపై ఉందని ఆమె తెలిపారు. వార్డు స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి అందరూ కంకణబద్దులై పని చేయాలని ఆమె పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేయాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రైతు బీమా, రైతు బంధు ప్రవేశపెట్టిందని.. దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలను మన రాష్ట్రంలో అమలవుతున్నాయని మంత్రి వివరించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతున్నదని ఆమె ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో మేయర్ దుర్గాదీప్లాల్ చౌహాన్, డిఫ్యూటీ మేయర్ విక్రంరెడ్డి, కో -ఆప్షన్ సభ్యులు, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.