షాద్నగర్టౌన్, జూలై 13 : పోచమ్మతల్లి బోనాలతో షాద్నగర్ పట్టణంలో పండుగ వాతావరణం నెలకొన్నది. భక్తుల సందడితో పోచమ్మ దేవాలయం కిటకిటలాడింది. మహిళలు, యువతులు బోనాలతో అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి సమర్పించే తొట్టెలతో బోనాల ఉత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ పాల్గొన్నారు. భక్తిభావాన్ని అలవర్చుకోవాలని తెలిపారు. పోతరాజుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. దీంతో షాద్నగర్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నది. ఈ వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజ్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
సురంగల్, పెద్దమంగళారంలో..
మొయినాబాద్ : బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పోతరాజుల విన్యాసం, శివసత్తుల పూనకాల మధ్య బోనాల ఊరేగింపు సాగింది. గురువారం మండల పరిధిలోని సురంగల్ గ్రామంలో కట్టమైసమ్మ దేవాలయానికి భక్తులు బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అదే విధంగా పెద్దమంగళారం గ్రామంలో గండి మైసమ్మ, కట్ట మైసమ్మ, అమ్డాపూర్ గ్రామంలో రక్త మైసమ్మకు బోనాలను సమర్పించారు. కాశీంబౌలి, నక్కలపల్లి, మొయినాబాద్, అప్పారెడ్డిగూడ, బాకారం, గ్రామాల్లో బోనాల ఉత్సవాలు నిర్వహించారు.
అంతిరెడ్డిగూడలో..
నందిగామ : నందిగామ మండలం అంతిరెడ్డిగూడ గ్రామంలో గురువారం మైసమ్మ, పోచమ్మ బోనాలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. డప్పు దరువులు, పోతరాజుల, శివసత్తుల విన్యాసాలు, శిగాలతో మహిళలు, జోగిని శ్యామలతో కలిసి బోనాలను ఎత్తుకుని అమ్మవార్లకు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు.