ఆదిబట్ల, మే 18 : కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి సోమవారం ఫిర్యాదులు పోటెత్తాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ నారాయణరెడ్డికి విన్నవిస్తూ అర్జీలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
అర్జీలను పెండింగ్లో పెట్టొద్దన్నారు. మొత్తం 92 ఫిర్యాదులు అందగా.. అందులో రెవెన్యూశాఖకు చెందినవి-32కాగా, ఇతర శాఖలకు చెందినవి 60గా ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. అనంతరం ఆయన జనగణన-2027 కార్యక్రమంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్యూమరేటర్లు ఇంటింటికెళ్లి గృహ జాబితా వివరాలను నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, కిరణ్మయి, డీఆర్వో శారద, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.