ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 29 : కాలం కలిసిరాక, అకాల వర్షాలు, పూత తెగులు మొదలైన ఆటంకాలు, అడ్డంకులు ఉన్నప్పటికీ మార్కెట్లకు మామిడి కాయల దిగుమతి రోజు రోజుకూ పెరుగుతున్నది. రంగారెడ్డి జిల్లా బాట సింగారం పండ్ల మార్కెట్లో రికార్డు స్థాయిలో మామిడి ఎగుమతులు జరుగుతున్నాయి. మామిడి పంట చేతికి అందుతున్న సమయంలో రంగారెడ్డి జిల్లాతో పాటు పలు జిల్లాలకు చెందిన మామిడి కాయలను బాట సింగారం పండ్ల మార్కెట్కు తరలిస్తున్నారు. ఈ పండ్ల మార్కెట్కు ప్రతిరోజూ 700 నుంచి 850 వరకు లారీలు వస్తున్నాయి. లోడుల కొద్దీ మామిడి కాయలు వస్తుండడంతో వ్యాపారం కూడా అంతే స్థాయిలో జరుగుతున్నది.
ఈ పండ్ల మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా వంటి రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఎగుమతులు జరుగుతున్నాయి. గత సంవత్సరం ఈ సీజన్లో బాట సింగారం పండ్ల మార్కెట్ నుంచి 1.20 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి పండ్లను ఎగుమతి చేశారు. కానీ, ఈ ఏడాది అకాల వర్షాలతో పాటు పూత తెగులు వంటి వాటి వలన మామిడి ఉత్పత్తి తగ్గినట్లు ఉద్యానవన శాఖ అధికారులు తెలిపారు. అయినప్పటికీ ఈ ఏడాది బాట సింగారం పండ్ల మార్కెట్కు ఇప్పటివరకు 45 వేల మెట్రిక్ టన్నుల మామిడికాయలు వచ్చాయి. ఈ సీజన్ పూర్తయ్యే నాటికి 1.50 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి వచ్చే అవకాశముందని మార్కెటింగ్ అధికారులు పేర్కొంటున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్లో తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల మామిడి వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఇందులో ఒక్క బాట సింగారం పండ్ల మార్కెట్కే 1.50 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశాలుండటంతో పండ్ల మార్కెట్లో క్రయ విక్రయాలు ఊపందుకున్నాయి. మార్కెట్ పరిసరాలు రైతులు, వ్యాపారస్తులతో మార్కెట్ కిటకిటలాడుతున్నాయి. మరోవైపు రైతులతో పాటు వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మార్కెట్ కమిటీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రైతులు తీసుకువచ్చిన మామిడికాయలపై నాలుగు శాతం మాత్రమే కమీషన్ వసూలు చేయాలని మార్కెటింగ్ శాఖ అధికారులు మైకులు, బ్యానర్ల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు.
బాట సింగారం పండ్ల మార్కెట్లో మామిడికి ఆశించిన స్థాయిలో గిట్టుబాటు ధర వస్తున్నట్లు రైతులు తెలిపారు. ఒక టన్ను మామిడి కాయలకు రూ.25 వేల నుంచి రూ.65 వేల వరకు ధరలు పలుకుతున్నాయి. నాణ్యమైన పండ్లకు గిట్టుబాటు ధరలు వస్తుండటంతో రైతులు సంతృప్తి చెందుతున్నారు. మామిడి సీజన్ ముగిసే వరకు రైతులకు నాణ్యమైన గిట్టుబాటు ధర అందేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
అలాగే, వ్యాపారులు కొనుగోలు చేసిన మామిడిని నిల్వ ఉంచుకోవటం కోసం కోల్డ్ స్టోరేజీ సౌకర్యాన్ని కూడా అధికారులు కల్పించారు. దీంతో బాట సింగారం పండ్ల మార్కెట్లో మామిడి ఎగుమతుల్లో సీజన్ ముగిసే సరికి మంచి లాభాలు గడించే అవకాశాలు కూడా ఉన్నాయి.